Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Congo Ebola Outbreak : కాంగోలో ఎబోలా విజృంభణ...అనుమానిత కేసులు వేయి

Congo Ebola Outbreak : కాంగోలో ఎబోలా విజృంభణ...అనుమానిత కేసులు వేయి

TeluguPost.com 2 weeks ago

కాంగోలో అరుదైన బుండిబుగ్యో రకం ఎబోలా వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని సమీక్షించి నియంత్రణ చర్యలకు మద్దతు ఇవ్వడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ గెబ్రేయేసస్ కాంగో రాజధాని కిన్షాసాకు చేరుకున్నారు.

వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. కాంగోలో ఇప్పటివరకు 125 నిర్ధారిత ఎబోలా కేసులు నమోదయ్యాయి. వీరిలో 17 మంది మరణించారు. మరో 906 అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలను అధికారులు గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ శుక్రవారం వెల్లడించింది. పొరుగు దేశమైన ఉగాండాలో తొమ్మిది కేసులు, ఒక మరణం నమోదైనట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.కిన్షాసా విమానాశ్రయంలో గురువారం రాత్రి టెడ్రోస్ మాట్లాడుతూ, "ఇక్కడికి రావడం ద్వారా ప్రజలు ఒంటరిగా లేరనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాం" అన్నారు.

కాంగో చేరుకున్న డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి..."జెనీవాలోని నా కార్యాలయంలో కూర్చొని ఆదేశాలు ఇవ్వడం సులభం. కానీ నా సహచరులు ప్రజలతో కలిసి పనిచేయాలని కోరుతున్నాను. ప్రజలు కూడా తమను తాము రక్షించుకోవాలి" అని చెప్పారు. ఈ వ్యాధిని అరికట్టవచ్చని, అయితే పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సాయుధ ఘర్షణల వల్ల భారీగా ప్రజలు నిరాశ్రయులవడం, ఆహార భద్రత సమస్యలు తలెత్తడం వంటి అంశాలు నియంత్రణ చర్యలకు అడ్డంకిగా మారుతున్నాయని టెడ్రోస్ తెలిపారు. ఈ వారం బాధిత ప్రాంతాలకు వైద్య సామగ్రి చేరినప్పటికీ, పరికరాల కొరత, ప్రజల్లో అవిశ్వాసం, సాయుధ గుంపుల కార్యకలాపాలు ఇంకా ఇబ్బందులు సృష్టిస్తున్నాయని చెప్పారు.మే మధ్యలో వ్యాధిని గుర్తించేలోపే కొన్ని వారాల పాటు వైరస్ వ్యాపించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల నియంత్రణ మరింత కష్టమైంది.చికిత్స, టీకా లేక సవాలు...ప్రస్తుతం వ్యాపిస్తున్న బుండిబుగ్యో రకం ఎబోలాకు ఆమోదిత టీకా గానీ, చికిత్స గానీ లేదు. అయినప్పటికీ కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ అత్యవసర కార్యక్రమ పరిశోధకురాలు అనైస్ లెగాండ్ తెలిపారు.బుధవారం ఒక రోగి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం ప్రస్తుత వ్యాప్తిలో నమోదైన తొలి నిర్ధారిత కోలిక అని చెప్పారు. మరో ఐదుగురు రోగులు కూడా కోలుకునే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ వైరస్ మరణాల శాతం సాధారణంగా 30 నుంచి 50 శాతం మధ్య ఉంటుందని వివరించారు.యూరోపియన్ యూనియన్ అందించిన వైద్య సహాయం గురువారం ఇటురి ప్రాంతానికి చేరింది. రానున్న ఎనిమిది రోజుల్లో మరిన్ని సరఫరాలు అందనున్నాయి. అదే రోజు అమెరికా అదనంగా 80 మిలియన్ డాలర్ల సాయం ప్రకటించింది. దీంతో మొత్తం సహాయం 112 మిలియన్ డాలర్లకు పైగా చేరింది.ఇటురిలోని ర్వాంపారా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన చికిత్స కేంద్రంలో గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడింది. ఎక్కువ మంది సిబ్బంది, కట్టుదిట్టమైన నివారణ చర్యలు, రక్షణ దుస్తులతో వైద్య బృందాలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ రోగుల రాక మాత్రం ఆగడం లేదు.బునియా జనరల్ ఆసుపత్రిలో కూడా కొత్త వైద్య కిట్లు, సహాయక సిబ్బంది, అత్యవసర నిధులు అందడంతో కార్యకలాపాలు వేగం పుంజుకున్నాయి.అయితే ఇంకా మరిన్ని పరికరాలు, సరఫరాలు అవసరమని వరల్డ్ విజన్ తూర్పు కాంగో డైరెక్టర్ డేవిడ్ మంక్లే చెప్పారు.పరిశుభ్రత అవసరం..."వ్యక్తిగత రక్షణ పరికరాలు, ప్రజలకు మద్దతు, పరిశుభ్రత చర్యలు అవసరమని మాకు తెలుసు. ఇప్పుడు అసలు ప్రశ్న వాటికి నిధులు అందుతాయా లేదా అన్నదే" అని వ్యాఖ్యానించారు.కాంగో ఆరోగ్య మంత్రి శామ్యూల్ రోజర్ కాంబా మాట్లాడుతూ, మరిన్ని ప్రాణాలను కాపాడగల మందులపై పరిశీలన చేస్తున్నామని తెలిపారు. "ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు తల తిరగడం, తలనొప్పి, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి సాధారణ అంటువ్యాధుల మాదిరిగానే ఉంటాయి" అన్నారు.ఆఫ్రికా సీడీసీ అధిపతి జీన్ కసేయా మాట్లాడుతూ, ఈ ఏడాది చివరికల్లా బుండిబుగ్యో వైరస్‌కు టీకా, చికిత్స అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.ప్రజాగ్రహం, భద్రతా సమస్యలు...మృతదేహాల నిర్వహణలో అమలు చేస్తున్న కఠిన వైద్య నిబంధనలు స్థానిక అంత్యక్రియల సంప్రదాయాలకు విరుద్ధంగా ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. దీంతో కనీసం మూడు సార్లు ఆరోగ్య కేంద్రాలపై దాడులు జరిగాయి.ఇటురి ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ అనుబంధ తిరుగుబాటు సంస్థ అలైడ్ డెమోక్రటిక్ ఫోర్స్, ఇతర జాతి మిలీషియా గుంపుల దాడులు కూడా సహాయక చర్యలను దెబ్బతీస్తున్నాయి.వ్యాధి ఉత్తర కివు, దక్షిణ కివు ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ఈ ప్రాంతాల్లో రువాండా మద్దతు ఉన్న ఎం23 తిరుగుబాటు దళాలు గోమా, బుకావు సహా కీలక నగరాలను నియంత్రిస్తున్నాయి. అక్కడ రెండు కేసులు నమోదైనట్లు సమాచారం.ఉగాండా కాంగో సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో, ప్రయాణాలపై నిషేధాలు విధించడాన్ని తాను సమర్థించనని టెడ్రోస్ తెలిపారు. "పూర్తి ప్రయాణ నిషేధాలు లేకుండానే కార్మికులు, రోగుల నిర్వహణ సాధ్యమే" అని చెప్పారు.ఇటీవల అమెరికా ప్రభుత్వం గత 21 రోజుల్లో కాంగో, ఉగాండా లేదా దక్షిణ సూడాన్ సందర్శించిన అమెరికా పాస్‌పోర్టు లేని వ్యక్తుల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం ప్రకటించింది.అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం (సీడీసీ)కు చెందిన 230 మందికిపైగా సిబ్బంది ఎబోలా నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్నారు. వీరిలో కొందరు అమెరికా విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తుండగా, మరికొందరు కాంగో, ఉగాండాల్లో సేవలందిస్తున్నారు.అయితే ఎబోలా బారిన పడిన సిబ్బందిని అమెరికా ప్రభుత్వం తిరిగి స్వదేశానికి తీసుకువస్తుందా అనే అంశంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని ప్రస్తుత, మాజీ సీడీసీ ఉద్యోగులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu