తెలంగాణ కాంగ్రెస్ మంత్రుల్లో సఖ్యత లేదు. ఎవరి పని వారే చేసుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలకు సయితం కనీసం మంత్రులు స్పందించడం లేదు.
రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇందరు మంత్రులు ఉన్నప్పటికీ ఇద్దరో, ముగ్గురో విపక్షాల విమర్శలకు స్పందిస్తున్నారు. అసలు బీఆర్ఎస్, బీజేపీలకు కౌంటర్ ఇచ్చే మంత్రి కేబినెట్ లో కనిపించడం లేదన్న విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలే కాని, మంత్రులు ఎవరూ తమకు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా మంత్రుల తీరులో మార్పు లేదు. వారి మౌనం ఎందుకన్నది ఎవరకిీ అర్థం కాకుండా ఉంది.
కాంగ్రెస్ లో విభిన్నం...
ఎక్కడైనా ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వెంటనే మంత్రులు ధీటుగా సమాధానమిస్తారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం విభిన్నమైన పరిస్థితి. ఎవరి శాఖ వారిదే. తమ శాఖపై వచ్చిన ఆరోపణలను మాత్రమే వారు ఖండిస్తున్నారు. అదీ తప్పనిసరి పరిస్థితుల్లో కౌంటర్ ఇస్తున్నారు. ధాన్యం సేకరణపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నప్పటికీ ఎవరూ స్పందించ లేదు. మరొకవైపు హరీశ్ రావు తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న వ్యాఖ్యలను కూడా శ్రీధర్ బాబు మినహా మరెవరూ ఖండించకపోవడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని అంటున్నారు.
ఏదో తెలియని అసంతృప్తి?
మరొకవైపు మంత్రుల్లో ఏదో తెలియని అసంతృప్తి కూడా ఉందన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. గాంధీ భవన్ కు వచ్చే మంత్రుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఉన్న మంత్రుల్లో ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్ గా కనిపిస్తున్నారు. మిగిలిన వారు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ వంటి సీనియర్ నేతలు కూడా మూగనోము పట్టడం ఎందుకన్న ప్రశ్న ఇప్పుడు కాంగ్రెస్ నేతలను వేధిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదో జరుగుతుందన్న ప్రచారం మరింత ఊపందుకుంది. ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సమిష్టిగా ఎదుర్కొని సరైన కౌంటర్ ఇవ్వాల్సిన మినిస్టర్లు మౌనం వహించడంపై చర్చ జరుగుతుంది.

