Andhra Pradesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించడమే మానుకున్నారు. ఆయన అధికారంలో ఉండి కూడా కొన్ని సమస్యలపై ప్రశ్నించవచ్చు. అంతర్గత సమావేశాల్లోనైనా ప్రస్తావించవచ్చు.
పార్టీ సమావేశాల్లోనూ తన అభిప్రాయాలను చెప్పవచ్చు. ట్వీట్ ద్వారానైనా చెప్పొచ్చు. కానీ గత రెండేళ్లుగా మాత్రం కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న లోటు పాట్లను ప్రశ్నించలేకపోతున్నారని, అందువల్లనే పవన్ కల్యాణ్ ఫేమ్ మసకబారుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అనేక సమస్యలు తలెత్తుతున్నా పవన్ కల్యాణ్ రియాక్ట్ కాకపోవడాన్ని జనసైనికులే తప్పుపడుతున్నారు. ఇలా అయితే జనంలో పలుచన అవుతామన్న ఆందోళన వారిలో కనపడుతుంది.
అనేక సమస్యలు వస్తున్నా...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పట్టినా బెల్ట్ షాపులు దర్శనమిస్తున్నాయి. అలాగే ఉచిత ఇసుక వల్ల కూడా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూడా ఉపాధి లభించడం లేదు. ఇక శాంతి భద్రతల విషయానికి వస్తే మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి పడవ గల్లంతయి ఆరుగురు చనిపోవడం, గుంటూరులో మహిళను వివస్త్ర చేయడం వంటి అంశాలు కూటమి సర్కార్ ను ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. అయితే కనీసం ఇటువంటి ఘటనలను ఖండిస్తూ పవన్ కల్యాణ్ ఒక ప్రకటన చేయకపోవడాన్ని కూడా జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నా పవన్ పట్టీపట్టనట్లు వ్యవహరించడం ఏమిటని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. హోంమంత్రి పై గుడివాడ అమర్ నాధ్ చేసిన వ్యాఖ్యలకు వెంటనే స్పందించిన పవన్ గుంటూరులో మహిళ వివస్త్రను చేయడంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న...ఇక కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న సంఘటనలపై స్పందించకుండా అధికారంలోని వైసీపీ నేతలపై విమర్శలు చేస్తేజనం ఏమనుకుంటారంటున్నారు. జగన్ అధికారంలోకి రాకూడాదని పవన్ కల్యాణ్ కోరుకోవడంలో తప్పులేదు. అలాగని తప్పును తప్పని ప్రశ్నించకుంటే.. ప్రశ్నించడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పిన మాటలకు విలువ లేకుండా పోతుందని కూడా అంటున్నారు. అనకాపల్లి జిల్లాలో పంచధార కొండల్లో అక్రమ మైనింగ్ జరుగుతుంటే, అందులో సొంత పార్టీ ఎమ్మెల్యే భాగస్వామిగా ఉన్నారని ఆరోపణలు వచ్చినా పవన్ రియాక్ట్ కాకపోవడం జనసేనను జనంలో భారీగా డ్యామేజీ చేస్తుందని అంటున్నారు. అయితే చివరకు మైనింగ్ రద్దు చేయాలని పవన్ ఆదేశించడం కొంతలో కొంత నయమని అంటున్నారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ తప్పులను నిలదీసి ప్రతిపక్ష పాత్రను కూడా పోషిస్తే జనసేనకు భవిష్యత్ ఉంటుందని, లేకపోతే ఇతర రాజకీయ నేతల మాదిరిగానే పవన్ ను ప్రజలు పరిగణిస్తారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

