జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాపు సామాజికవర్గాన్ని దూరం చేసుకుంటున్నారనిపిస్తుంది. పదే పదే తాను కాపు సామాజికవర్గం కోసమే రాజకీయాల్లోకి రాలేదని ఆయన చెప్పడంతో ఒకింత ఆ సామాజికవర్గం ఒకింత మనస్థాపానికి గురవుతున్నారు.
నిజానికి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు పెట్టిన వారు కేవలం ఒక సామాజికవర్గం కోసం పార్టీ పెట్టరు. తన సామాజికవర్గం ఓటర్లను మాత్రం దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు కమ్మ సామాజికవర్గం కోసమే, జగన్ రెడ్డి సామాజికవర్గం కోసమే పార్టీ పెట్టలేదు. పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారు. కానీ కాపు సామాజికవర్గం మాత్రం పవన్ కల్యాణ్ వ్యాఖ్యల పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.
బలమైన ఓటు బ్యాంకు...
కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ ను తమ కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు భావిస్తుంది. రాష్ట్రంలో అత్యధిక ఓటు బ్యాంకున్న సామాజికవర్గం కావడంతో సహజంగా ముఖ్యమంత్రిగా తమ సామాజికవర్గానికి చెందిన వారు ఎన్నికవ్వాలని కోరుకుంటారు. అందులో తప్పుపట్టడానికి లేదు. కానీ పవన్ కల్యాణ్ కు కేవలం కాపు సామాజిక వర్గం ఓటర్లు మాత్రమే ఓట్లు వేస్తే గెలిచేందుకు అవకాశాలు లేవు. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి తనను ఎందుకు ఓడించారన్న పవన్ కల్యాణ్ ప్రశ్న కూడా నిజమే. ఎందుకంటే కేవలం కాపులు మాత్రమే ఓట్లు వేస్తే గెలవరు. అన్ని సామాజికవర్గాలకు చెందిన వారు ఓట్లు వేయాలి.
మార్పు కోసమేనంటూ...
మరొకవైపు తాను మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రం రాలేదని చెప్పడంతో కాపు సామాజికవర్గంలో ఒకింత నిరాశ వ్యక్తమయ్యే అవకాశముంది. పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే పదిహేనేళ్లు సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పడాన్ని మరలా మరొకసారి ఈ రకమైన ముఖ్యమంత్రి పదవి కోసం రాలేదని చెప్పడంతో వచ్చే ఎన్నికల్లో జనసేనకు కాపు సామాజికవర్గం దూరమయ్యే ఛాన్స్ కొట్టిపారేయలేం. తాను అధికారంలోకి వచ్చింది కాపుల సంక్షేమాన్ని చూడటం కోసమే కాదని, అందరి ప్రయోజనాలను కాపాడటానికేనని వచ్చానని చెప్పడం కూడా ఆయన రానున్న ఎన్నికల్లో నష్టం చేకూర్చే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

