జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత ఆయన జిల్లాల పర్యటన ఉంటుందని తెలిసింది.
ప్రస్తుతం పది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో పవన్ కల్యాణ్ రెస్ట్ లో ఉన్నారు. మే రెండో వారంలో ఆయన తిరిగి పాలనలో బిజీ అవుతారు. ఇక జూన్ నెల నుంచి జిల్లాల పర్యటనలు ప్రారంభమవుతాయని అంటున్నారు. అప్పటికి వేసవి తీవ్రత తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా ఫిట్ అవుతామని భావించి జూన్ నెలలో అన్ని జిల్లాలను పర్యటించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారని సమాచారం.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...ఇందుకోసం పార్టీ కీలక నేతలకు పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండటంతో తాను వెళ్లి జనసేన నేతల్లోనూ, కార్యకర్తల మధ్య సమన్వయం కుదిర్చే పనిని చేపట్టాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. అనేక నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడాన్ని పవన్ కల్యాణ్ గుర్తించారు. అయితే ఇప్పటి వరకూ ఒక లెఖ్ఖ. ఇకపై మరొక లెఖ్ఖ. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమితో పాటు జనసేన కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. అప్పుడే రానున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు సులువుగా మారుతుందన్న అంచనాలున్నాయి. సమన్వయ కమిటీ సమావేశంలో...అందుకే పవన్ కల్యాణ్ జిల్లాల పర్యటనల్లో ముఖ్య నేతలతో పాటు, కార్యకర్తలతో కూడా సమావేశమవుతారని తెలిసింది. దీంతో పాటు ఆ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను కూడా గుర్తించి దానిని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరొకవైపు టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన సమన్వయ కమిటీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ చంద్రబాబును కోరనున్నట్లు తెలిసింది. తాను జిల్లాల పర్యటనల్లో గుర్తించిన సమస్యలను సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి వారిలో గూడుకట్టుకున్న అసంతృప్తిని తొలగించాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద జూన్ నెల నుంచి ఇక జనసేన ను యాక్టివ్ చేయాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నారు.

