Andhra Pradesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ అనుభవ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనను ట్రాప్ లాగేందుకు కొందరు మిత్ర పక్షాల నేతలే ప్రయత్నిస్తున్నారని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు.
తమ చేతికి మట్టి అంటకుండా పవన్ కల్యాణ్ ను బద్నాం చేయాలని చూస్తున్నారన్న వాదన జనసేన నేతల్లో ఎక్కువగా వినిపిస్తుంది. జనసేన నేతలు సోషల్ మీడియాలోనూ ఇదే రకమైన కామెంట్స్ చేస్తున్నారు. జనసేన అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసినప్పుడు ఖచ్చితంగా మిత్ర పక్షాలు అండగా నిలబడాల్సి ఉంటుంది. పవన్ కల్యాణ్ కూటమిలోని మిగిలిన మిత్రపక్షాల నేతలకు ఇబ్బంది పరిస్థితులు వచ్చినప్పుడు పవన్ కల్యాణ్ నేరుగా స్పందిస్తారు. చివరకు హోం మంత్రి అనితపై కామెంట్స్ చేసినా పవన్ వెంటనే స్పందిస్తారు.
పవన్ పై విమర్శలు వచ్చినప్పుడు...కానీ అదే పవన్ కల్యాణ్ పై విమర్శలు వచ్చినప్పడు మాత్రం ఎవరూ స్పందించరు. పవన్ కల్యాణ్ కు ఇది అర్థమవుతుందా? అని కొందరు జనసైనికులు నేరుగా ప్రశ్నిస్తున్నారు. ఇటీవల యూట్యూబర్ రావణ్ విషయంలో అదే జరిగిందని జనసైనికులు గుర్తు చేస్తున్నారు. యూట్యూబర్ రావణ్ పవన్ పై విమర్శలు చేసినప్పుడు మూడు పార్టీల నేతలు స్పందించాలి. రావణ్ కు అనుకూలంగా ప్రకాశ్ రాజ్ వంటి వారు వచ్చి సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పటికీ పవన్ కల్యాణ్ కు మద్దతుగా కూటమి నేతలు కలసి రాలేదన్నది అందరూ అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఏంటి? పవన్ కల్యాణ్ ను ఒక వర్గం నుంచి దూరం చేయాలన్న ప్రయత్నమేనా? లేక రావణ్ ను విమర్శిస్తే ఆ సామాజికవర్గం ఓటర్లను దూరం చేసుకోవడం ఇష్టంలేని కూటమిలోని మిత్రపక్షాలు ఈ వివాదానికి దూరంగా ఉన్నాయి. రావణ్ వ్యవహారంలోనూ...తమకు ఏం పట్టనట్లు వ్యవహరించాయి. రావణ్ పై దేశద్రోహం నేరం కింద కేసు నమోదు చేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. వాటిని ఖండించేవారు కూడా లేరు. తిరుమల లడ్డూ విషయం నుంచి అన్ని అంశాల వరకూ పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వం కష్టాల్లో ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవుతారు. కానీ అదే పవన్ కష్టాల్లోఉన్నప్పుడు ఎందుకు కూటమి నేతలు ముందుకు రారని కొందరు జనసైనికులు నేరుగా సోషల్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ ఇవేమీ పట్టించుకునే పరిస్థితి లో లేరని, ఆయన తనపై వచ్చే విమర్శలకు తానే సమాధానం చెప్పుకోవాలని నిర్ణయించుకోవడంతోనే ఈ రకమైన పరిస్థితి ఏర్పడిందని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కూటమిలోని మిత్ర పక్షాలు పవన్ కు ఎందుకు అండగా నిలబడటం లేదన్న జనసైనికుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీలపైనే ఉంది. శత్రువులతో యుద్ధం చేయవచ్చు. కానీ మిత్రులుగా ఉన్న వారే ఇలా చేస్తే ఎలా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

