తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు. పార్టీని తెలంగాణలోనూ విస్తరించాలని ఆయన సిద్ధమయ్యారు. మరి జనసేనాని ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది మాత్రం అనుమానమే.
తెలంగాణలో జనసేనకు అంత ఓటు బ్యాంకు లేదన్నది వాస్తవం. ఏపీలో సామాజికవర్గంతో పాటు అభిమానుల ఓటు బ్యాంకు ఉంది. అదే సమయంలో తెలంగాణలో మాత్రం పవన్ కల్యాణ్ కు అభిమానులున్నారు. అయితే ఫ్యాన్స్ ఇప్పటికే వివిధ పార్టీల్లో ఉన్నారన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో పార్టీని ఎలా బలోపేతం చేస్తారన్నది ఇప్పుడు సందేహమే.
ఏపీ పార్టీలన్నీ...ఇటు తెలుగుదేశంపార్టీ, అటు వైసీపీలు కూడా తెలంగాణలో తమ పార్టీ శాఖలను పూర్తిగా వదిలేశాయి. ఆంధ్రపార్టీలుగా ముద్ర పడటంతో వారు ఏపీలోనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్కడే అధికారంలోకి వచ్చే అవకాశముండటంతో ఏపీలోనే తమ ఓటు బ్యాంకును మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ జనసేన టీడీపీ, వైసీపీలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ ఓటు బ్యాంకు ఉన్న పార్టీ. ఇన్నాళ్లూ లేనిది ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఎందుకు తెలంగాణలో జనసేనను బలోపేతం చేయాలన్న ఆలోచన వచ్చిందన్నది పార్టీ నేతలకే అర్థం కావడం లేదు. ఏపీలో క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన సమయంలో తెలంగాణలో వేలు పెట్టడం ఎందుకని కొందరు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.అభిమానులున్నప్పటికీ...అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలోనే పార్టీని తెలంగాణలోనూ బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో తనకు అధిక సంఖ్యలో అభిమానులున్నారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలన్న ఉద్దేశ్యం కనిపిస్తున్నట్లుంది. గత మున్సిపల్ ఎన్నికల్లోనే బీజేపీ నేతలు జనసేనానితో భేటీ అయినప్పటికీ, ప్రచారంలో పాల్గొనాలని కోరినప్పటికీ తర్వాత వాయిదా పడిన విషయాన్ని కూడా కొందరు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏపీ మూలాలనున్న పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని అంటున్నారు. మరి ఈ సమయంలో పవన్ నిర్ణయం కరెక్టేనా? అన్నది కాలమే తేల్చనుంది.

