తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని తన చేతుల్లోకి తీసుకున్నారు. కాంగ్రెస్ లో ప్రస్తుతం నడిచేదంతా రేవంత్ దే. ఆయన హవా ముందు మరే నేత లేకుండా పోతున్నారు.
రేవంత్ కు కూడా కాంగ్రెస్ నాయకత్వం పూర్తి స్థాయి స్వేచ్ఛనిచ్చిందని అంటున్నారు. హైకమాండ్ ఆదేశాలతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలను యధేచ్ఛగా, స్వేచ్ఛగా తీసుకుంటున్నారని చెబుతున్నారు. సాధారణంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతే స్థాయిలో స్వపక్షంలో విపక్షం కూడా బలంగా ఉంటుంది. కానీ తెలంగాణలో మాత్రం అంతా ఏకపక్షంగానే నడుస్తుందన్నది వాస్తవం. అది నేతలతో పాటు క్యాడర్ కూడా అంగీకరిస్తున్న విషయం. అందుకే రేవంత్ రెడ్డి పదేళ్లు తానే ముఖ్యమంత్రినని ధైర్యంగా చెప్పుకుంటున్నారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా...
కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా సరే అక్కడ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మరొకవర్గం ఖచ్చితంగా ఉంటుంది. కర్ణాటకలో సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా డీకే శివకుమార్ వర్గం నిరంతరం పనిచేస్తుంటుంది. హైకమాండ్ కు వెళ్లి సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం రివర్స్ లో ఉంది. అసమ్మతి నేతలకు ఢిల్లీ లోటెన్ జన్ పథ్ గేట్లు తెరుచుకునే పరిస్థితులు లేవంటున్నారు. తాను తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాహుల్ తో చెప్పి రేవంత్ చేస్తుండటమే ఇందుకు కారణమని, తాను అటువంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను కూడా రాహుల్ చెప్పి రేవంత్ ఒప్పిస్తుండటంతోనే అసమ్మతి గళానికి అక్కడ ఛాన్స్ లేకుండా పోయిందంటున్నారు.
పదవుల పంపిణీలోనూ...
పదవుల పంపిణీలోనూ, పార్టీ విషయంలో నియామకాల్లోనూ రేవంత్ రెడ్డిదే పైచేయి. పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నామమాత్రంగానే మారిపోయారు. రేవంత్ చెప్పిన సూచనలను పార్టీ నేతలకు చేరవేయడమే మీనాక్షి పని అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించడం విశేషం. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయి రెండున్నరేళ్లు గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాయిస్ వినిపించే వారు లేరు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొంత కాలం ఎగిరెగిరి పడినా.. తర్వాత పరిస్థితులను అర్థం చేసుకుని ఆయన కూడా సైలెంట్ అయ్యారంటున్నారు. మొత్తం మీద ప్రస్తుతం కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఏం చెబితే అది జరుగుతుంది. అందుకే నేతలు రేవంత్ ను కలసి ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారన్నది పార్టీలో ఇన్నర్ వర్గాల టాక్.

