Telangana : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెన్ జీకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో యువతను ఆకట్టుకునేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందిస్తున్నారు.
ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి జెన్ జీ నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. వారి సమస్యలను తెలంగాణలో పరిష్కరించడమే కాకుండా వారు ఎన్నికల్లో పోటీ చేసే వయసు విషయంలోనూ వయసును తగ్గించాలని ఇటీవల రేవంత్ రెడ్డి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీని నిరిసిస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద యువత ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. రాష్ట్రంలోనూ యువ ఓటర్లకు గాలం వేయాలన్న ప్లాన్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతకు సీట్లు కేటాయించేలా ఢిల్లీ పర్యటనలో పార్టీ హైకమాండ్ ను ఒప్పించనున్నారని తెలిసింది.
యువతకు ప్రాధాన్యం పెరగాలని...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టసభల్లో 'జెన్ జీ' యువతకు ప్రాతినిధ్యం పెరగాలని, పోటీ చేసే వయసును 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కోరడం ద్వారా యువత దృష్టిని ఆకర్షిస్తున్నారు. భవిష్యత్ రాజకీయాల్లో యువత పాత్ర కీలకం అని ఆయన భావిస్తున్నారు. అయితే, విద్యార్థుల నైపుణ్యాలపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీశాయి.రేవంత్ రెడ్డి వ్యూహం మరియు ప్రాధాన్యతలు యువత వైపు ఇటీవల కాలంలో కనిపించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. చట్టసభల్లో జెన్ జీ యువతకు అవకాశం కల్పించాలని ప్రతిపాదన ఈ నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్నారు. ఈ తీర్మానం తెలంగాణ అసెంబ్లీలో చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి బీజేపీని కూడా ఇరుకున పెట్టే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నట్లు కనపడుుది.
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును...
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు కుదించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో యువ నాయకులకు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే వారికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు తెచ్చేలా ఒత్తిడి తెచ్చే వ్యూహంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. యువత ఆలోచనలకు అనుగుణంగా రాజకీయ వ్యూహాలు అమలు చేయడం ఇప్పుడు తెలంగాణలో రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే కాకుండా దేశంలోని యువత మొత్తాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించి వచ్చే ఎన్నికల నాటికి దేశంలోకాంగ్రెస్ పార్టీకి దగ్గర చేయాలన్న స్ట్రాటజీ రేవంత్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇది మరింత ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

