Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Russia Ukraine war : ఉక్రెయిన్‌, రష్యాలో పరస్పర దాడులు.. ఇరువైపులా మృతులు

Russia Ukraine war : ఉక్రెయిన్‌, రష్యాలో పరస్పర దాడులు.. ఇరువైపులా మృతులు

TeluguPost.com 5 days ago

Kyiv : ఉక్రెయిన్‌లోని దక్షిణ నగరం జపొరిజ్జియాలో నివాస ప్రాంతాలపై రష్యా యుద్ధవిమానాలు 90 నిమిషాల వ్యవధిలో ఎనిమిది శక్తివంతమైన గ్లైడ్‌ బాంబులు వదిలాయి.

ఈ దాడిలో 71 ఏళ్ల మహిళ ఒకరు చనిపోయారు. మరో 31 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో 16 ఏళ్ల బాలిక కూడా ఉందని ప్రాంతీయ అధికారి ఇవాన్‌ ఫెడొరోవ్‌ సోమవారం తెలిపారు.అదే సమయంలో ఉక్రెయిన్‌ ప్రయోగించిన డ్రోన్ల శకలాలు రష్యాలోని క్రాస్నొదార్‌ ప్రాంతం, నల్ల సముద్ర తీరంలోని అర్ఖిపో-ఒసిపోవ్కా పట్టణంపై పడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారని, మరో 40 మంది గాయపడ్డారని ప్రాంత గవర్నర్‌ వెనియామిన్‌ కొండ్రాట్యేవ్‌ తెలిపారు.రష్యా ఆక్రమణలో ఉన్న క్రిమియాపై ఉక్రెయిన్‌ రాత్రి దాడి చేయడంతో ముగ్గురు చనిపోయారని, ఇద్దరు గాయపడ్డారని అక్కడి రష్యా నియమిత అధికారి సెర్గీ అక్స్యోనోవ్‌ చెప్పారు. దీనిపై ఆయన మరిన్ని వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనలపై ఇరుపక్షాలు చేసిన ప్రకటనలను స్వతంత్రంగా ధ్రువీకరించడం సాధ్యం కాలేదు.

9 దేశాలతో రక్షణ ఒప్పందాలు...యుద్ధ కాలంలో అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి డ్రోన్‌ సాంకేతికతతో ఉక్రెయిన్‌ ఇప్పటికే తొమ్మిది దేశాలతో సైనిక సహకార ఒప్పందాలు చేసుకుందని అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ తెలిపారు. ఈ ఒప్పందాల ప్రకారం ఉక్రెయిన్‌ రక్షణ పరిశ్రమకు దీర్ఘకాలిక నిధులు అందుతాయని, భాగస్వామ్య దేశాలకు కొత్త రక్షణ సామర్థ్యాలు లభిస్తాయని చెప్పారు. మరో 15 దేశాలతో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.రష్యా భూభాగంలో లోతైన లక్ష్యాలపై దీర్ఘశ్రేణి డ్రోన్లతో దాడులు చేసి అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను శాంతి చర్చల దిశగా తీసుకురావడమే తమ లక్ష్యమని జెలెన్‌స్కీ చెప్పారు."ఈ శరదృతువులో అది సాధించేందుకు మేం తీవ్రంగా కృషి చేస్తాం" అని ఆయన ఉక్రెయిన్‌ దౌత్యవేత్తల సమావేశంలో అన్నారు.రష్యాపై అంతర్జాతీయ ఆంక్షలను మరింత కఠినం చేయాలని, ఇప్పటికే ఉన్న ఆంక్షల్లోని లోపాలను కూడా మూసివేయాలని జెలెన్‌స్కీ కోరారు.అమెరికాతో దౌత్య చర్చల్లో పాల్గొన్న రుస్తెమ్‌ ఉమెరోవ్‌ను విదేశీ గూఢచార సంస్థ అధిపతిగా నియమిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.గ్లైడ్‌ బాంబులతో విధ్వంసం...నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా గ్లైడ్‌ బాంబులను విస్తృతంగా ఉపయోగిస్తోంది. సోవియట్‌ కాలం నాటి ఈ బాంబులకు మార్గనిర్దేశక వ్యవస్థలు అమర్చి, 3,000 కిలోల వరకు పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లేలా మార్చింది. వీటి దాడులతో భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. వీటిని అడ్డుకునే సమర్థ వ్యవస్థ ఉక్రెయిన్‌ వద్ద లేదు.ఆదివారం సాయంత్రం జపొరిజ్జియాపై జరిగిన దాడిలో నగరంలోని నాలుగు ప్రాంతాల్లో 22 అపార్ట్‌మెంట్‌ భవనాలు దెబ్బతిన్నాయని ఫెడొరోవ్‌ తెలిపారు.జపొరిజ్జియా అణు విద్యుత్‌ కేంద్రం సహా ఆ ప్రాంతంలోని కొన్ని భాగాలు రష్యా ఆధీనంలో ఉన్నా, ప్రాంత రాజధాని జపొరిజ్జియా నగరం మాత్రం ఇప్పటికీ ఉక్రెయిన్‌ నియంత్రణలోనే ఉంది. 2022 సెప్టెంబరులో జపొరిజ్జియా, డొనెత్స్క్‌, ఖెర్సన్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలను రష్యా చట్టవిరుద్ధంగా విలీనం చేసుకుంది. అయితే ఆ నాలుగు ప్రాంతాలపై ఇప్పటికీ పూర్తి నియంత్రణ సాధించలేదు.మరిన్ని పేట్రియట్‌ వ్యవస్థలు కావాలి...రష్యా బాలిస్టిక్‌ క్షిపణి దాడులతో కూడా పౌర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని జెలెన్‌స్కీ చెప్పారు. ఉక్రెయిన్‌కు మరిన్ని అమెరికా తయారీ పేట్రియట్‌ వైమానిక రక్షణ వ్యవస్థలు అందించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు."మాకు ఏం అవసరమో అమెరికాకు తెలుసు. యూరప్‌కూ తెలుసు. బాలిస్టిక్‌ క్షిపణులను అడ్డుకునే క్షిపణులు గోదాముల్లో ఉండటానికి కాదు, ప్రజలను కాపాడటానికి ఉపయోగపడాలి" అని జెలెన్‌స్కీ సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు.ఇరాన్‌ యుద్ధం వల్ల పేట్రియట్‌ క్షిపణుల కొరత ఏర్పడిందని ఆయన చెప్పారు.ఉక్రెయిన్‌కే పేట్రియట్‌ వ్యవస్థల తయారీకి అనుమతి ఇవ్వాలన్న గత హామీ నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన గత వారం చెప్పారు.రష్యాలోని బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగ కేంద్రాలను గుర్తించేందుకు స్టార్‌లింక్‌ ఉపగ్రహాలను వినియోగించే అవకాశం కల్పించాలని ఎలాన్‌ మస్క్‌కు జెలెన్‌స్కీ ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేశారు. దీనిపై పరిశీలన జరుగుతోందో లేదో అధికారులు వెల్లడించలేదు.కొనసాగుతున్న డ్రోన్‌ దాడులు...ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రష్యా 181 దీర్ఘశ్రేణి డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. వీటిలో 163 డ్రోన్లను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని ఉక్రెయిన్‌ వైమానిక దళం తెలిపింది. అయితే 14 డ్రోన్లు 13 ప్రాంతాల్లో నష్టం కలిగించాయి.ఉక్రెయిన్‌ సైన్యానికి సరుకు తీసుకెళ్తున్న నాలుగు సరుకు నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. వీటిలో మూడు నల్ల సముద్రంలో, ఒకటి మైకొలైవ్‌ నౌకాశ్రయంలో ఉన్నట్లు తెలిపింది. అయితే మరిన్ని వివరాలు వెల్లడించలేదు.రష్యాలో గిడ్డంగులు, చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు...రష్యాలోని అతిపెద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ సంస్థ వైల్డ్‌బెర్రీస్‌కు చెందిన మరో ప్రధాన గిడ్డంగిపై ఉక్రెయిన్‌ డ్రోన్లు దాడి చేశాయి. మాస్కోకు తూర్పున ఉన్న వ్లాదిమిర్‌ ప్రాంతంలోని గిడ్డంగిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని గవర్నర్‌ అలెగ్జాండర్‌ అవ్దేయెవ్‌ తెలిపారు.సరటోవ్‌ చమురు శుద్ధి కేంద్రంతో పాటు అక్కడి ఎంగెల్స్‌ సైనిక వైమానిక స్థావరం, కలుగా ప్రాంతంలోని ల్యుడినోవ్‌స్కయా చమురు నిల్వ కేంద్రాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నామని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా సైన్యానికి ఇంధన సరఫరాను దెబ్బతీయడం, చమురు ఎగుమతుల ఆదాయాన్ని తగ్గించడమే ఈ దాడుల ఉద్దేశమని చెప్పారు.సోమవారం ఉదయం వరకు రష్యాలోని పలు ప్రాంతాలు, క్రిమియా, నల్ల సముద్రంపై ఉక్రెయిన్‌ ప్రయోగించిన 131 డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చేశాయని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Post Telugu