తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా క్లోజ్ చేసినట్లే కనపడుతుంది. మహానాడు వంటి కార్యక్రమాల్లో మాత్రమే తెలంగాణ టీడీపీ నేతలు కనపడుతున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనధికారికంగా మూత వేసినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
మరోసారి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి మళ్లీ రావడం టీడీపీ నాయకత్వం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. 2024లో గెలిచిన తొలినాళ్లలో చంద్రబాబు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చి టీటీడీపీ నేతలతో సమావేశమై ఇక్కడ పార్టీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత మాత్రం ఆ దిశగా ఎటువంటి చర్యలుచేపట్టలేదు. మహానాడులో మాత్రం తెలంగాణ టీడీపీ నేతలు కనిపించి వెళ్లిపోతున్నారు.
అధ్యక్షుడి నియామకం...
మరొకవైపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి నియామకం కూడా చేపట్టలేదు. అసలు కార్యవర్గాన్నే నియమించలేదు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీపై ఆంధ్ర పార్టీగా ముద్ర పడింది. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ తెలంగాణలో వైసీపీని మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జాతీయ పార్టీ గా ఉండలని భావించి తెలంగాణలో వరసగా అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తుంది. 2014, 2018 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసి తక్కువ స్థానాల్లో విజయం సాధించింది. అయినా గెలిచిన వారు ఎవరూ పార్టీలో ఉండలేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ఎన్నికలకు వెళ్లింది.
ఏపీలో బీజేపీతో...
2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణను పూర్తిగా వదిలేసినట్లే కనపడుతుంది. చంద్రబాబు హైదరాబాద్ కు వారం వారం వస్తున్నప్పటికీ టీటీడీపీ నేతలతో సమావేశం అయ్యేందుకు సుముఖంగా కనిపించడం లేదు. అందులో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీలో టీడీపీ కూటమిగా ఉండటం, తెలంగాణలో మాత్రం బీజేపీ టీడీపీతో పొత్తుకు అంగీకరించకపోవడంతో ఇక్కడ సైకిల్ పార్టీని పూర్తిగా గాలికి వదిలేసింది. ఉన్న కొద్దోగొప్పో ఓటు బ్యాంకు ఇతర పార్టీలకు తరలి వెళ్లాయి. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం లేదు. దీంతో టీడీపీ తెలంగాణ శాఖ దాదాపుగా మూసివేసినట్లేనన్న సంకేతాలను పార్టీ నాయకత్వం ఇచ్చిందనే చెప్పాలి.

