తెలుగుదేశం పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
జిల్లా ఇన్ ఛార్జి మంత్రులు కూడా పూర్తిగా చేతులెత్తేశారు. ఎవరి వైపు ఉంటే ఏం జరుగుతుందోనన్న భయంతో మంత్రులు కూడా మనకెందుకులేనని మౌనంగా ఉంటున్నారు. అయితే రాను రాను ఈ విభేదాలు పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయేమోనన్న ఆందోళన పార్టీ క్యాడర్ లో వ్యక్తమవుతుంది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదంటున్నారు. నియోజకవర్గ స్థాయి నేతల్లో గొడవలు తారా స్థాయికి చేరుకోవడంతో క్యాడర్ కూడా అయోమయంలో పడింది. మహానాడు సందర్భంగా ఈ విభేదాలు మరింత బహిర్గతమయ్యాయి.
దాదాపు అన్ని ప్రాంతాల్లో...ఉత్తరాంధ్ర,కోస్తాంధ్ర, రాయలసీమ ఒక చోట కాదు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా కన్నబాబు వర్గం అసమ్మతి గళం విప్పింది. తమను పట్టించుకోకుండా వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రయోజనాలు చేకూరుస్తారని, వారికే కార్యక్రమాలకు కూడా ఆహ్వానాలు అందుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డికి, మాజీ టీడీపీ ఇన్ ఛార్జి ప్రవీణ్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రెండు వర్గాలు ఇటీవల బాహాబాహీకి దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు...అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యేకు, మాజీ ఎమ్మెల్యేకు మధ్య పొసగడం లేదు. గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేతలు ఒకరిపై ఒకరు నాయకత్వానికి ఫిర్యాదు చేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో మాజీ మంత్రికి వ్యతిరేకంగా ఒక వర్గం పార్టీ నాయకత్వం ఎదుట పంచాయతీ పెట్టడం కూడా చర్చనీయాంశమైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని పార్టీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, లోకేశ్ నేరుగా జోక్యం చేసుకుని విభేదాలను పరిష్కరించకపోతే ఈ ప్రభావం లోకల్ బాడీ ఎన్నికలపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకే పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్ లు కల్పించుకోవాని పార్టీ అభిమానులు కోరుతున్నారు.

