తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. అలిపిరి టోల్ గేట్ నుంచే రద్దీ కనిపిస్తుంది.
నిన్న అలిపిరి టోల్ గేట్ వద్దనే భక్తులను నిలిపి టోకెన్లు మంజూరు చేశారు. వారికి ఇచ్చిన సమయం తర్వాత మాత్రమే అనుమతించారు. వేసవి రద్దీ మరికొంత కాలం కొనసాగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. రోజుకు ఎనభై వేల మందికి పైగా భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
వేసవి రద్దీ కొనసాగుతుండటంతో...తిరుమలకు వచ్చే భక్తులు కాలినడకన కూడా వస్తారు. గత రెండు రోజుల నుంచి దాదాపు డెబ్భయి వేల మంది భక్తులు కాలినడకన తిరుమలకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అలాగే శ్రీవారికి తలనీలాలను సమర్పించే వారి సంఖ్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పోటీ పరీక్షాల ఫలితాలు రానుండటంతో పాటు విద్యాసంస్థలకు సెలవులు ముగియనుండటంతో భక్తుల సంఖ్య అధికంగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సామాన్య భక్తులకు సులువుగా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్ గోగర్భం డ్యామ్ వరకూ విస్తరించింది. అంటే కిలోమీటర్ల మేర క్యూ లైన్ కొనసాగుతుంది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల నుంచి ముప్ఫయి గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుంది. శీఘ్రదర్శనం టోకెన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయంపడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 86,315 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 44,107 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.94 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

