తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. మంగళవారమయినా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు. తిరుమలకు వేసవి రద్దీ కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది.
తిరుమలకు వచ్చే భక్తులు వివిధ మార్గాల్లో వస్తుండటంతో తిరుమలలోని మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు అవసరమైన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు.
వేసవి సెలవుల నేపథ్యంలో...వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరుగుతున్నప్పటికీ టీటీడీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కీలకపాత్ర పోషిస్తోంది.తిరుమలలోని క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు, అన్నప్రసాద కేంద్రాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాలు, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భక్తుల కదలికలు, రద్దీ తీవ్రత, క్యూ లైన్ల ప్రవాహం వంటి అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ తక్షణ నిర్ణయాలు తీసుకుంటున్నారు.అన్ని కంపార్ట్ మెంట్లు నిండి...తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకూ భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టోకెన్లున్న భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు నుంచి ఐదు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 80,455 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తలనీలాలు 43,309 మంది భక్తులు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.41 కోట్లువచ్చిందని అధికారులు తెలిపారు.

