ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భిన్న మైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీవ్రమైన ఎండలతో పాటు వానలు కూడా కురుస్తున్నాయి.
నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించినప్పటికీ ఇంకా రాష్ట్రమంతటా విస్తరించలేదు. కొంత మందగమనంతో నైరుతి పవనాలు నడుస్తున్నాయి. దీంతో ఉక్కపోత వాతావరణంతో పాటు ఎండ వేడిమి కూడా ఉంటుంది. పగటి పూట గరిష్టంగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే సాయంత్రానికి పలు చోట్ల చెదురుమదురు వానలు పడుతున్నాయి. మరో వారం పది రోజుల పాటు ఇలాంటి వాతావరణం ఉండవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలో గరిష్టంగానే ఉష్ణోగ్రతలు...ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. అయితే అక్కడక్కడా వానలు పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలో చురుగ్గా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని చెబుతున్నప్పటికీ వానలు అనుకున్న స్థాయిలో పడటం లేదు. కొన్ని జిల్లాల్లో మాత్రమే పడుతుంది. ఈరోజు ఈదురుగాలులతో చెదురుమదురుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కోమసీమ, తూర్ప గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశంఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. తెలంగాణలో రుతుపవనాలు...తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి మూడు రోజులవుతుంది. అయితే అవి నెమ్మదిగా సాగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. గద్వాల్ జిల్లాలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. మరో ఐదు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అప్పుడు ఉత్తర తెలంగాణలోనూ వానలు పడతాయని చెప్పారు. అలాగే ఈసారి ఎలినినో ప్రభావంతో కొంత వర్షపాతం గత ఏడాదితో పోలిస్తే పదిశాతం తక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న కాలంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని అంటున్నారు.

