కర్నూలు జిల్లాకు చెందిన బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయినట్లు కనిపిస్తుంది. అందుకే టీడీపీ నేతలపై కాలుదువ్వుతున్నారు.
మంత్రి టీజీ భరత్ పై ఆరోపణలు చేసి వివాదాన్ని కొని తెచ్చుకున్నారు. వివాదాలతో మరింత హైలెట్ అవుదామని బైరెడ్డి భావించి ఉండవచ్చు. అనుకున్న మైలేజీ వస్తుందని అనుకుని ఉండవచ్చు. అందుకే టీజీ భరత్ పై అవినీతి ఆరోపణలు చేసి గత కొన్ని రోజులుగా మీడియాలో హైలెట్ అయ్యారు. దీంతో బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి అనుకున్న గమ్యానికి చేరుకున్నట్లయింది. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది స్పష్టం చేయకపోయినా ఈసారి మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
పునర్విభజనలో...బైరెడ్డి సిద్ధార్ధ రెడ్డి ఇప్పటి వరకూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. నందికొట్కూరు నుంచి ఆయన 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించడంలో కీలక భూమిక పోషించినప్పటికీ అది రిజర్వడ్ నియోజకవర్గం. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజనలో నందికొట్కూరు జనరల్ నియోజకవర్గంగా మారితే అక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి. 2004 వరకూ నందికొట్కూరు నియోజకవర్గం జనరల్ లోనే ఉంది. 2009 నియోజకవర్గ పునర్విభజనలో ఎస్.సి. రిజర్వ్ డ్ నియోజకవర్గంగా మారింది. అక్కడ ఒకసారి కాంగ్రెస్, రెండు సార్లు వైసీపీ, ఒకసారి టీడీపీ గెలిచింది. అంతకు ముందు జనరల్ నియోజకవర్గంగా ఉన్నప్పుడు కూడా టీడీపీ మూడు సార్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచిన నియోజకవర్గం. అయితే డీలిమిటేషన్ లో మార్పు జరగకపోతే ఆయన కర్నూలు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. తాజా వివాదంతో...తాజాగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, మంత్రి టీజీ భరత్ మధ్య తీవ్రమైన రాజకీయ విభేదాలు, వివాదాలు కొనసాగుతున్నాయి.కర్నూలు జిల్లాలోని ఒక ఫార్మా కంపెనీ వద్ద మంత్రి టీజీ భరత్ రూ.45 కోట్లు వసూలు చేశారని, భూకబ్జాలకు పాల్పడ్డారని బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బహిరంగ సభల్లో తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో టీజీ భరత్ తనపై, తన కుటుంబంపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేసి పరువుకు భంగం కలిగించారంటూ కర్నూలు త్రీ-టౌన్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, అవినీతి ఆరోపణలను నిరూపిస్తానని బైరెడ్డి స్పష్టం చేశారు. మరోసారి ఆరోపణలు చేయడంతో టీజీ భరత్ తిరిగి మళ్ళీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఆయన కాలు దువ్వుతూ శాసనసభలోకి అడుగుపెట్టాలన్న లక్ష్యంతోనే ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది.

