Andhra Pradesh : వైసీపీ జోరుకి సొంత పార్టీ నేతలే కళ్లెం వేస్తున్నారు. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి ఆరోపణలు ఆ పార్టీపై ప్రభావం చూపుతున్నాయి. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు పార్టీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.
అందులోనూ తమ్మినేని సీతారాం కుటుంబం మొత్తం ఈ అవినీతిలో కూరుకుపోవడంతో, తర్వాత పరారు కావడం ఫ్యాన్ పార్టీకి తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది. నాలుగు కోట్ల రూపాయల విలువైన భూమిని ఫోర్జరీ చేసి తమ పేరు రాయించుకున్నారన్న తమ్మినేని కుటుంబంపై ఆరోపణలతో కేసు నమోదు కావడంతో వైసీపీ ఇప్పుడు జనం ముందు తలదించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
తమ్మినేని ఎపిసోడ్ లో...
మాజీ స్పీకర్ గా ఉండి భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొనడంతో కేవలం ఈ ప్రభావం ఉత్తరాంధ్రకు మాత్రమే పరిమితం కాలేదు. రాష్ట్ర మంతటా వైసీపీ అధికారంలో ఉన్నప్పడు భూ కబ్జాలకు పాల్పడ్డారన్న నాడు టీడీపీ చేసిన ఆరోపణలకు బలం చేకూరినట్లయింది. తమ ఆస్తి పాస్తులను అక్రమంగా సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటే.. మరోసారి వైసీపీఅధికారంలోకి రావాలని ఎలా కోరుకుంటామని జనం అభిప్రాయపడుతున్నారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ తమ్మినేని సీతారాం ఎపిసోడ్ తో వైసీపీకి భారీ డ్యామేజీ జరిగినట్లయింది. దీనిపై వైసీపీ నాయకత్వం కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.
సీదిరి అప్పలరాజు కుమారుడు...
అదే జిల్లాలో ఇక మరో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా యాక్సిడెంట్ కేసులో తన కుమారుడిని రక్షించే ప్రయత్నం కూడా వైసీపీకి వికటించేలా ఉంది. అప్పలరాజు కుమారుడు ఒక వ్యక్తిని తన బైకుతో ఢీకొట్టడంతో అతను చనిపోయాడు. అయితే ఈ కేసు నుంచి తన కుమారుడిని రక్షించడానికి మరొక వ్యక్తిని ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. సీసీ టీవీ కెమెరాల్లో ఈ విజువల్స్ స్పష్టంగా కనిపించాయి. దీంతో పోలీసులు అప్పలరాజు కుమారుడితో పాటు ఆయనపై కూడా కేసు నమోదు చేశారు. అదే సమయంలో విశాఖ పర్యటనలో జగన్ అప్పలరాజు కుమారుడిపై అక్రమ కేసులను ప్రభుత్వం పెట్టిందంటూ వెనకేసుకు రావడం కూడా అభాసుపాలు చేసింది. మొత్తం మీద వైసీపీ నేతలే ఆ పార్టీకి శత్రువులుగా మారారు. కూటమి సర్కార్ ఈ ఘటనలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటుంది.

