భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. గ్రంధి శ్రీనివాస్ గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేశారు.
ఆయన బీజేపీలోనో, టీడీపీలోనో చేరాలని అనుకున్నారు. కానీ ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు. దీంతో ఆయన తిరిగి వైసీపీ గూటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది. అయితే గ్రంథి శ్రీనివాస్ పార్టీలో చేరేందుకు జగన్ అంగీకరిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. కాపు సామాజికవర్గానికి చెందిన గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై పోటీ చేసి విజయం సాధించి జెయింట్ కిల్లర్ గా పేరు పొందారు. కానీ 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.
దాడుల తర్వాత...గ్రంథి శ్రీనివాస్ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు జరగడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. గ్రంథి శ్రీనివాస్ కు రొయ్యల చెరువులున్నాయి. రొయ్యల ఎగుమతుల వ్యాపారాలున్నాయి. ఈ వ్యాపారానికి సంబంధించి ఆదాయపు పన్ను మొత్తాన్ని చెల్లించలేదన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహించారు. దాడుల తర్వాత వైసీపీని వీడి ఆయన బీజేపీ లేదా టీడీపీలో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. రెండేళ్లలోనే కూటమి ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత రావడంతో పాటు, జిల్లా టీడీపీ రాజకీయాల్లో గ్రూపు విభేదాలు నెలకొని ఉండటంతోనే గ్రంథి శ్రీనివాస్ వైసీపీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. అన్ని సామాజికవర్గాల్లోగ్రంధి శ్రీనివాస్ కు భీమవరంలోని అన్ని సామాజికవర్గాల్లో బలమైన వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉండటం ఆయనకు కలసి వచ్చే అంశంగా వైసీపీ నాయకత్వం కూడా చూస్తుందట. మరొకవైపు కాపు సామాజికవర్గంలోనూ జనసేన పార్టీ నాయకత్వంపై ఒకింత అసంతృప్తి ఉండటం తనకు ఫ్యాన్ పార్టీ అయితేనే కలసి వస్తుందని గ్రంథి శ్రీనివాస్ అంచనా వేసుకున్నారట. ఈ మేరకు ఆయన తన సన్నిహితుల వద్ద పదే పదే వైసీపీ యాక్టివ్ అయిందని చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు అద్దం పడుతున్నాయి. అయితే పార్టీని వీడిన నేతలను తిరిగి వైసీపీలో చేర్చుకోవడంపై వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకుంటేనే గ్రంథి శ్రీనివాస్ చేరిక సాధ్యమవుతుంది. ఎవరినీ చేర్చుకోకూడదని జగన్ నిర్ణయం తీసుకుంటే మాత్రం గ్రంథి శ్రీనివాస్ మరొక పార్టీ వైపు చూడాల్సి ఉంటుంది.

