వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతల్లో ఉత్సాహం కనిపించడం లేదు. ఎక్కువగా మౌనంగానే ఉంటున్నారు. వైఎస్ జగన్ కూడా నేతల తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇద్దరు ముగ్గురు మినహా ఎవరూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి ముందుకు రావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడుమంత్రి పదవులు అనుభవించిన వారు సయితం మౌనంగా ఉండటం పార్టీ శ్రేణులను మానసికంగా దెబ్బతీస్తుంది. వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు కూడా నేతలు చేయకపోతుండటంతో దానికి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఎక్కువగా స్పందించి అధికార పార్టీ కంట్లో పడటం ఎందుకన్న భావన నేతల్లో ఉందని భావిస్తున్నారు.
మాజీ మంత్రులు...
నిజానికి మంత్రిపదవులు, కీలక పదవులు వైసీపీ ప్రభుత్వంలో అనుభవించిన వారికంటే సోషల్ మీడియాలో జగన్ అంటే అభిమానమున్న వారు చేసే విమర్శలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. జిల్లాల వారీగా చూసుకున్నా పది మంది కూడా బయటకు వచ్చి ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించే వారు కరువయ్యారు. ఎటొచ్చీ ఎటు పోతుందేమోనన్న భయం వారిని పట్టుకుందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో, కోస్తాంధ్ర, రాయలసీమలోనూ అదే పరిస్థితి. పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు వంటి వారు మినహా ఎవరూ పెద్దగా రియాక్ట్ కావడం లేదు. అదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది.
నెంబర్ టూ గా వ్యవహరించిన...
వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ టూ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరామిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారే మౌనంగా ఉంటుంటే తమకు ఎందుకొచ్చిన గోల అన్న భావన నేతల్లో కనపడుతుంది. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా నేతల వాయిస్ ఎక్కడా కనిపించడం లేదు. విడదల రజని ఓటమి పాలయిన కొత్తలో కొంత హడావిడి చేసినప్పటికీ తర్వాత మాత్రం కనిపించకుండా పోయారు. దీంతో వైసీపీ వాయిస్ అనేది వినిపించడం లేదన్నది వైసీపీ సోషల్ మీడియా నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి వారికి టిక్కెట్లు ఇవ్వడంతో పాటు, పదవులు ఇచ్చి జగన్ తప్పుచేశారన్న కామెంట్స్ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా కనపడుతున్నాయి.

