అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) గురువారం ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2027 కోసం 12 ఆతిథ్య వేదికలను అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో ఈ మెగా టోర్నీ జరుగుతుందని వెల్లడించింది.
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ ప్రకటన వెలువడింది. 'త్రీ నేషన్స్, వన్ హార్ట్ బీట్' పేరిట ఈ ప్రకటన విడుదల చేసింది. ఇది 3 అతిథ్య దేశాల మధ్య ఆశావాదం, వైవిధ్యం, ఐక్యతకు సూచిక అని పేర్కొంది.
ప్రపంచ కప్ 14వ ఎడిషన్లో మొత్తం 57 మ్యాచ్లు జరుగుతాయి. ఇందులో 14 జట్లు పాల్గొంటాయి. మొత్తంగా 12 నగరాల్లో ఈ మ్యాచులు జరుగుతాయి. వీటిలో దక్షిణాఫ్రికాలోని ఎనిమిది నగరాలు, జింబాబ్వేలో మూడు నగరాలు, నమీబియా రాజధాని విండ్ హోక్ ఆతిథ్య వేదికలుగా ఎంపికయ్యాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన 2003 ఎడిషన్ తర్వాత ఆఫ్రికాలో జరుగుతున్న తొలి పురుషుల వన్డే ప్రపంచకప్ ఇదే కావడం గమనార్హం.
24 ఏళ్ల తర్వాత మెగా ఈవెంట్ ఆఫ్రికాకు తిరిగి రావడం పట్ల ఐసీసీ ఛైర్మన్ జై షా స్పందించారు. ఇది క్రికెట్ చరిత్రలో కీలక మైలురాయిగా అభివర్ణించారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాలు మర్చిపోలేని క్రికెట్ టోర్నీని నిర్వహిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ టోర్నీ క్రికెట్కు ఉన్న ఆదరణను మరింత విస్తరించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027 మ్యాచ్లు జరిగే నగరాలు
దక్షిణాఫ్రికా..
వాండరర్స్ స్టేడియం (జోహన్నెస్ బర్గ్)
సెంచూరియన్ (త్ష్వానే)
న్యూలాండ్స్ క్రికెట్ గ్రౌండ్ (కేప్ టౌన్)
కింగ్స్మీడ్ క్రికెట్ గ్రౌండ్ (డర్బన్)
సెయింట్ జార్జ్ పార్క్ (గాబెర్హా)
మాంగాంగ్ ఓవల్ (బ్లోమ్ ఫోంటైన్)
బోలాండ్ పార్క్ (పార్ల్)
బఫెలో పార్క్ (కుగోంపో సిటీ, గతంలో తూర్పు లండన్ అని పిలిచేవారు)
జింబాబ్వే..
హరారే స్పోర్ట్స్ క్లబ్ (హరారే)
క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ (బులవాయో)
ఫాలే మోసి-ఓ-తున్యా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (విక్టోరియా జలపాతం)
నమీబియా..
నమీబియా క్రికెట్ గ్రౌండ్ (విండోక్)

