జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఆయన భార్య పాయల్ అబ్దుల్లా విడాకుల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ఈ జంటకు విడాకులు మంజూరు చేస్తామని తెలిపింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తమ వివాహ బంధాన్ని పరస్పర అంగీకారంతో రద్దు చేసుకుని.. పెండింగ్లో ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇరువురు అంగీకరించడంతో సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.
సీఎం ఒమర్ అబ్దుల్లా తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ఆ దంపతులు తమ వివాదాలన్నింటినీ మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకుని, తమ వివాహం రద్దు కోరుతూ ఆర్టికల్ 142 కింద విడాకుల పిటిషన్ దాఖలు చేశారని జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనానికి తెలియజేశారు. ''వారిద్దరూ విడిపోవడానికి అంగీకరించారు.. అంతా సమసిపోయింది. గౌరవ న్యాయస్థానం విడాకులు మంజూరు చేయవచ్చు. మిగతా వివాదాలు అన్నింటినీ ఉపసంహరించుకోవడం జరుగుతుంది'' అని సిబల్ కోర్టుకు తెలిపారు. 'అది మంచిది. మేము ఆ నిబంధనల ప్రకారమే దీనిని పరిష్కరిస్తాం'' అని కోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 142 కింద ఉమ్మడి దరఖాస్తును జులై 22న దాఖలు చేసినట్లు ధర్మాసనానికి తెలియజేశారు. ఇరు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుందని జస్టిస్ నరసింహ తెలిపారు. ఈ ఒప్పందంలో భాగంగా, ఒకరిపై ఒకరు దాఖలు చేసుకున్న అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయని కూడా సిబల్ కోర్టుకు తెలియజేశారు. ఈ వాదనలను తమ ఉత్తర్వులో నమోదు చేస్తామని జస్టిస్ నరసింహ ఈ సందర్భంగా చెప్పారు.
ఒమర్ అబ్దుల్లా, పాయల్లో 1994 సెప్టెంబర్ 1న వివాహం చేసుకోగా.. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మనస్పర్ధలు రావడంతో 2009 నుంచి విడిగా నివసిస్తున్నారు. అయితే, 2011లో భార్య నుంచి విడిపోతున్నట్లు ఒమర్ అబ్దుల్లా బహిరంగంగా ప్రకటించారు. దీంతో తమ 17 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలో విడాకులు కోసం తొలుత 2016లో ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించగా... అక్కడ చుక్కెదరయ్యింది. కింది కోర్టు నిర్ణయాన్ని 2023లో ఒమర్ అబ్దుల్తా ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. అక్కడ కూడా ఆయనకు వ్యతిరేకంగా తీర్పు రావడంతో గతేడాది సుప్రీంకోర్టుకు వెళ్లారు.

