Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
33 ఏళ్ల నాటి కేసులో దోషిగా తేలిన 84 ఏళ్ల వృద్ధుడు.. మరో నలుగురితో కలిసి నేరం చేయగా వారంతా మృతి!

33 ఏళ్ల నాటి కేసులో దోషిగా తేలిన 84 ఏళ్ల వృద్ధుడు.. మరో నలుగురితో కలిసి నేరం చేయగా వారంతా మృతి!

Telugu Samayam 1 week ago

Bihar Court Verdict 33 Years: బీహార్‌లోని వైశాలి జిల్లాలో మూడు దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఒక తీవ్రమైన దాడి కేసుకు సంబంధించి స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది.

ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉండగా.. సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణ కారణంగా నలుగురు నిందితులు కాలం చేశారు. చివరకు మిగిలిన ఏకైక నిందితుడైన 84 ఏళ్ల వృద్ధుడు దీప్ రాయ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. నేరం జరిగిన 33 ఏళ్ల తర్వాత ఈ తీర్పు వెలువడటంతో దేశవ్యాప్తంగా ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వయసు పైబడి, శారీరకంగా బలహీనపడిన సదరు వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు పట్టుకుని కోర్టు వెలుపలికి తీసుకువస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

1992లో భార్యాభర్తలపై దాడి..!

1992 మే 10వ తేదీన వైశాలి జిల్లా జుధావన్‌పూర్ గ్రామానికి చెందిన అదాలత్ రాయ్ అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఒక ఫిర్యాదు చేశారు. గ్రామంలో జరిగిన ఒక పాత వివాదాన్ని మనసులో ఉంచుకుని.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఘోరమైన ఆయుధాలతో తన ఇంటిపైకి వచ్చారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు తనపై, తన భార్యపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి, ప్రాణాంతక దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు పూర్తి చేసి 1993లో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఇదీ చూడండి: "ఈ కేసును 2046లో చూద్దాం": 90 ఏళ్ల వృద్ధురాలి మొండితనానికి బాంబే హైకోర్టు షాకింగ్ తీర్పు

ముగ్గురు దశాబ్దాల న్యాయపోరాటం..

చార్జ్‌షీట్ దాఖలైన తర్వాత ఈ కేసులో న్యాయ పోరాటం ఏకంగా 33 సంవత్సరాల పాటు సాగింది. కోర్టు వాయిదాలు, సుదీర్ఘ విచారణల ప్రక్రియ కొనసాగుతుండగానే.. ఐదుగురు నిందితుల్లో నలుగురు వేర్వేరు సమయాల్లో మరణించారు. దీంతో ఈ కేసులో చివరి నిందితుడిగా దీప్ రాయ్ ఒక్కరే మిగిలారు. వృద్ధాప్యం మీద పడినప్పటికీ.. ఆయనపై విచారణ నిరంతరాయంగా సాగింది. తాజాగా అన్ని పక్షాల వాదనలు విన్న అదనపు జిల్లా సెషన్స్ జడ్జి మనోజ్ కుమార్ తివారీ ఈ కేసులో తీర్పును ఖరారు చేశారు. దీప్ రాయ్‌పై మోపబడిన ఆరోపణలు నిజమేనని నిర్ధారిస్తూ.. భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 147 (రియాటింగ్), 148 (మారణాయుధాలతో అల్లర్లకు పాల్పడటం), 307 (హత్యాప్రయత్నం)తో పాటు ఆర్మ్స్ యాక్ట్‌లోని సెక్షన్ 134 కింద ఆయనను దోషిగా తేల్చారు.

ఇదీ చూడండి: 40 ఏళ్ల నాటి కేసు.. 100 ఏళ్ల వయసులో ఊరట: హత్య కేసులో నిర్దోషిగా బయటపడ్డ వృద్ధుడు

శిక్షా కాలంపై ఉత్కంఠ..

33 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత నిందితుడు దోషిగా తేలినప్పటికీ.. ఆయనకు ఎలాంటి శిక్ష పడబోతుందనేది ఇంకా ఖరారు కాలేదు. దీప్ రాయ్‌కు విధించబోయే శిక్షా కాలాన్ని కోర్టు బుధవారం ప్రకటించనుంది. నిందితుడు ప్రస్తుతం 84 ఏళ్ల వృద్ధుడు కావడంతో.. మానవీయ కోణాలను పరిశీలిస్తారా లేదా చట్టప్రకారం కఠిన శిక్ష విధిస్తారా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam