Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'ఆగండి కూర్చుని మాట్లాడుకుందాం' కొత్త పార్టీ ఏర్పాటు ప్రచారంపై అన్నామలై స్పష్టత

'ఆగండి కూర్చుని మాట్లాడుకుందాం' కొత్త పార్టీ ఏర్పాటు ప్రచారంపై అన్నామలై స్పష్టత

Telugu Samayam 1 week ago

మిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సొంతంగా రాజకీయ వేదికను ఏర్పాటుచేసుకోనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో కొద్ది రోజులుగా ఆయన అసహనంతో రగిలిపోతున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీలో తనకు అవకాశంగానీ, భవిష్యత్తుగానీ లేదని, జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌తో సమావేశం అనంతరం రాజీనామా చేసే అవకాశం ఉందని అన్నామలై పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిచిన విషయం తెలిసిందే. ఢిల్లీకి విమానం ఎక్కేందుకు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న అన్నామలై విలేకరుల బృందంతో ''దయచేసి వేచి ఉండండి.. మనం రెండు రోజుల్లో కూర్చుని మాట్లాడుకుందాం'' అని అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే విమానాశ్రయానికి ఆయన వచ్చిన వాహనంపై బీజేపీ జెండా లేదు.

జూన్ 4న అన్నామలై పుట్టినరోజు కావడంతో కోయంబత్తూరు, మదురై నగరాల్లో ప్రధాన రహదారులు, వీధుల్లో అన్నామలై '2.0 అవతార్' 'మా నాయకుడు, రండి మమ్మల్ని నడిపించండి' వంటి నినాదాలతో కూడిన పోస్టర్లను ఏర్పాటు చేశారు. అన్నామలైకు బీజేపీ రాజ్యసభ సీటును ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించినట్లు తెలిసింది. తన భవిష్యత్తుపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్న అన్నామలై... తనకు సమయం కేటాయించాల్సిందిగా అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కోరారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కూడా మాజీ ఐపీఎస్ కలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

తొలుత ఓ ఉద్యమాన్ని ప్రారంభించి, తర్వాత దానిని రాజకీయ వేదికగా మార్చాలనే ఉద్దేశంలో అన్నామలై ఉన్నట్టు తెలుస్తోంది. ఒకే రకమైన భావాలు గల వ్యక్తులను ఒకచోటకు చేర్చి, బలమైన స్వచ్ఛంద కార్యకర్తల నెట్‌వర్క్‌ను నిర్మించడమే దీని ఉద్దేశమని పలు వర్గాలు చెబుతున్నాయి. ఈ కొత్త ఉద్యమం విభిన్న వృత్తులు, సామాజిక నేపథ్యాల నుంచి స్వచ్ఛంద కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ప్రేరణ పొందిన అన్నామలై 2020లో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరిన వెంటనే తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు.

ఏడాది ఎల్. మురుగన్ కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్లడంతో ఆయన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ద్రావిడ పార్టీల ఆధిపత్యంలో ఉన్న తమిళనాడులో అన్నామలై బీజేపీ ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచారు. ఉధృతమైన ప్రచారాలు, విస్తృతమైన క్షేత్రస్థాయి పర్యటనలు, సోషల్ మీడియా ద్వారా ఆయన పార్టీ సంస్థాగత విస్తరణకు సహాయపడటంతో పాటు, వ్యక్తిగతంగా అనుచర వర్గాన్ని కూడా నిర్మించుకున్నారు.

కొన్నేళ్లుగా బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో తమిళనాడు ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేయాలని అన్నామలై భావించారు. కానీ, బీజేపీ నాయకత్వం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకుంది. అధికార డీఎంకేకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఓట్లు చీలిపోకుండా వ్యూహాత్మక నిర్ణయంగా ఈ చర్యను చాలామంది భావించారు. కానీ, చివరకు బీజేపీ నాయకత్వ మార్పుపై ఎడప్పాడి పళనిసామి పట్టుబట్టడంతో అన్నామలైను అధిష్ఠానం అధ్యక్ష పదవి నుంచి తొలగించింది. తర్వాత ఎన్నికల్లోనూ ఆయనకు పోటీచేసే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ పరిణామాలతో తీవ్రంగా కలతచెందిన అన్నామలై బీజేపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam