Dailyhunt
Air India: ఎయిరిండియాలో కీలక పరిణామం.. సీఈఓ విల్సన్ రాజీనామా.. ఆ ప్రమాదమే కారణమా?

Air India: ఎయిరిండియాలో కీలక పరిణామం.. సీఈఓ విల్సన్ రాజీనామా.. ఆ ప్రమాదమే కారణమా?

Telugu Samayam 6 days ago

Air India: దేశంలోని దిగ్గజ విమానయాన సంస్థ, టాటా గ్రూప్‌లోని కీలక సంస్థ అయిన ఎయిరిండియాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎయిరిండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారు.

మరో ఏడాది కాలం పాటు ఆయన పదవి కాలం ఉన్నప్పటికీ తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. అయితే, సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ రాజీనామాపై ఎయిరిండియా కంపెనీ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆయనపై టాటా గ్రూప్ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

న్యూజిలాండ్‌కు చెందిన విల్సన్ క్యాంప్‌బెల్ 2022, జూలై నెలలో ఎయిరిండియా విమాన సంస్థలో చేరారు. కంపెనీ సీఈఓగా బాధ్యతలు చేపట్టి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలోనే విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిరిండియాలో విలీనమైంది. ఆయన పదవీ కాలం 2027, జూన్ వరకు ఉంది. అయితే, కంపెనీ సేవల నాణ్యత, సమయ పాలనలో గుర్తించదగిన మెరుగుదల కనిపించలేదని టాటా గ్రూప్ పెద్దలు అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు గత ఏడాది గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమాన ఘోర ప్రమాదానికి గురైంది. విమానంలో బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. ఈ ఘరో ప్రమాదంతో విల్సన్ నాయకత్వంపై వ్యతిరేకత మొదలైందని చెబుతారు. ఇప్పుడే అదే ఆయన రాజీనామాకు దారితీసిందా? అనే చర్చకు కారణమైంది.

అహ్మదాబాద్ విమాన ప్రమాదం సమయంలో ప్రభుత్వ అధికారులు సైతం కంపెనీ సీఈఓ అయిన విల్సన్‌ను పక్కన పెట్టి నేరుగా టాటా గ్రూప్ పెద్దలతో మాట్లాడడం చర్చకు దారితీసింది. దీంతో ఆయనకు కంపెనీ ఉద్వాసన పలకబోతుందన్న వార్తలు అప్పట్లే చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో ఎయిరిండియా సీఈఓ పదవికి కొత్త వ్యక్తి కోసం టాటా గ్రూప్ అన్వేషణ మొదలు పెట్టినట్లు గత నెలలో పలు జాతీయ మీడియాలు పేర్కొన్నాయి. అమెరికా, యూకేకు చెందిన రెండు దిగ్గజ ఎయిర్‌లైన్స్‌కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్స్‌తో టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మాట్లాడినట్లు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

మరోవైపు ఎయిరిండియా అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌పెర్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తించిన అలోక్ సింగ్ సైతం ఇటీవలే తన పదవి నుంచి వైదొలిగిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేశారన్న వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. అటు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో గడిచిన 8 నెలల కాలంలోనే 300 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లో కంపెనీని వీడినట్లు తెలుస్తోంది. దీంతో టాటా గ్రూప్‌లో అసలు ఏం జరుగుతోంది? అనే ప్రశ్న మొదలైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam