లెజెండరీ సింగర్ ఆశా భోస్లే (92) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఏప్రిల్ 12) తుదిశ్వాస విడిచారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో శనివారం ఆమె తీవ్ర అస్వస్థకు గురయ్యారు.
అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో చేర్చారు. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆమె మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. సంగీత ప్రియులు, సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టులు పెడుతున్నారు. దిగ్గజ గాయని పాడిన పాటలను గుర్తు చేసుకుంటున్నారు.
ఆశా భోస్లే.. మహారాష్ట్ర సాంగ్లిలోని గోర్ అనే చిన్న కుగ్రామంలో 1933 సెప్టెంబరు 8న జన్మించారు. పదేళ్ల వయసులో 1943లో ఆమె సంగీత ప్రస్థానం ప్రారంభమైంది.. కొన్ని దశాబ్దాలపాటు అప్రతిహతంగా సాగింది. కొని వేల సంఖ్యలో పాటలు పాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించారు. సినిమా పాటలు, పాప్ మ్యూజిక్, గజల్స్, భజన పాటలతోపాటు భారత సాంప్రదాయ సంగీతం, జానపదాలు, ఖవ్వాలీ పాటలను పాడటంలో ఆమె సిద్ధహస్తురాలు. హిందీతో పాటు, ఆమె 20కి పైగా భారతీయ, విదేశీ భాషలలో పాటలు పాడి అలరించారు. తెలుగు సినిమాల్లోనూ పాటలు పాడారు.
ఆశా భోస్లే తెలుగులో పాడింది తక్కువ పాటలే అయినా, వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. 1981లో 'పాలు నీళ్లు' అనే సినిమాలో 'ఇది మౌనగీతం' అనే పాటను ఆలపించారు. ఇదే ఆమె పాడిన ఫట్ తెలుగు సాంగ్. ఆ తర్వాత 1988లో 'చిన్ని కృష్ణుడు' చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి 'జీవితం సప్త సాగరం' అనే గీతాన్ని పాడారు. దీనికి ఆమె భర్త ఆర్డీ బర్మన్ సంగీతం సమకూర్చారు.
ఇక 1992లో నందమూరి బాలకృష్ణ నటించిన 'అశ్వమేథం' సినిమాలో ఆశా భోస్లే రెండు పాటలు పాడి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇళయరాజా స్వరకల్పనలో ఆమె ఆలపించిన 'ఓ ప్రేమా', 'సీతాకాలం ప్రేమకు' పాటలు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ అనిపించుకున్నాయి. ఇవి ఇప్పటికీ ఎక్కడో చోట వినిపిస్తూనే ఉంటాయి.
'ప్రేమకు ప్రేమంటే తెలుసా'(1995) మూవీలో 'జల్లంది మది' అనే పాట పాడారు ఆశా భోస్లే. 1996లో ఎంఎం కీరవాణి 'పవిత్ర బంధం' సినిమాలో 'ఐసాలకిడీ' అనే సాంగ్ ను ఆమెతో పాడించారు. వెంకటేష్, సౌందర్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో.. ఆశా భోస్లేతో స్టేజ్ మీద ఈ సాంగ్ పాడించినట్లు చూపిస్తారు.

