బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి, అవామీ లీగ్ పార్టీ అధినేత్రి షేక్ హసీనాకుమారుడు సజీబ్ వాజెద్ తన సొంత దేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 'భారతశ తూర్పు సరిహద్దులో మరో పాకిస్థాన్గా' బంగ్లాదేశ్ మారిందని, విదేశీ గూఢచార సంస్థలు, ముఖ్యంగా పాక్ ఐఎస్ఐ దేశంలో స్వేచ్ఛగా పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.
ఇది భారత్కు ఆందోళన కలిగించే విషయమని వాజెద్ వ్యాఖ్యానించారు. అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన ఆగస్టు 5 సంక్షోభానికి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో తొలిసారి షేక్ హసీనా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. న్యూఢిల్లీలో ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ (FCC) ఆఫ్ సౌత్ ఆసియా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ప్రసంగానికి ముందు వాజెద్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జులై 2024లో యువత చేపట్టిన నిరసనల్లో మరణాల సంఖ్యపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తారు.
మరణాల సంఖ్యపై పొంతలేని సమాచారం
ఐక్యరాజ్యసమితి అంచనా వేసిన సుమారు 1,400 మరణాలు, గత మధ్యంతర ప్రభుత్వం చెప్పిన 800కు పైగా మరణాల సంఖ్యకు ఎందుకు భిన్నంగా ఉన్నాయని, 600 అదనపు వివరాలు ఐరాసకు ఎక్కడ నుంచి లభించాయని వాజెద్ ప్రశ్నించారు. మృతుల సంఖ్యను లెక్కించిన వారి వివరాలను అందించాలని అవామీ లీగ్, దాని లాయర్లు ఐక్యరాజ్యసమితికి పదేపదే చేసిన అభ్యర్థనలకు సమాధానం రాలేదని ఆయన పేర్కొన్నారు.మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న నిరసనకారులకు పూర్తి చట్టపరమైన రక్షణ కల్పించిందని, వేలాది మంది అవామీ లీగ్ సభ్యులను విచారణ లేదా సరైన ప్రక్రియ లేకుండా జైలులో పెట్టారని వాజెద్ ఆరోపించారు. అదుపులో ఉన్న పలువురు మరణించారని కూడా ఆయన పేర్కొన్నారు.అధికారం చేజిక్కించుకోడానికి కుట్ర
షేక్ హసీనా మాట్లాడుతూ... 2024 విద్యార్థి నిరసనలను 'అసాంఘిక శక్తులు' హైజాక్ చేసి, ఆ ఉద్యమాన్ని 'హింసాత్మక రాజకీయ అలజడిగా' మార్చాయని ఆరోపించారు. ఆగస్టు నిరసనలను అడ్డదారిలో అధికారం చేజిక్కించుకోడానికి ఒక మార్గంగా ఉపయోగించుకున్నారని హసీనా దుయ్యబట్టారు. ''నేను కేవలం ఐదుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తిగానే కాదు.. జాతిపిత బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తెగా కూడా మాట్లాడుతున్నాను'' అని ఆమె అన్నారుతమ ప్రభుత్వం మొదటి నుంచీ చర్చల ద్వారా నిరసనలను పరిష్కరించడానికి ప్రయత్నించిందని హసీనా వెల్లడించారు. ''మొట్టమొదటి నుంచి, నా ప్రభుత్వం చర్చల ద్వారా నిరసనలను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించింది. అయితే, అసాంఘిక శక్తులు విద్యార్థుల డిమాండ్లను హింసాత్మక రాజకీయ ఆందోళన సాధనాలుగా మార్చడానికి పనిచేశాయి. విసిగిపోయిన విద్యార్థులను భావోద్వేగపరంగా రెచ్చగొట్టారు'' అని ఆమె అన్నారు.
మాస్టర్ మైండ్ మొహమ్మద్ యూనస్
''ముహమ్మద్ యూనస్ మాస్టర్ మైండ్గా వ్యవహరించి పకడ్బందీగా రూపొందించిన ఉద్యమం ఇది.. ఆయన మాటలు నిజాన్ని బయటపెడుతున్నాయి... విద్యార్థులు స్వచ్ఛందంగా జరిపిన నిరసన కాదు.. ఎలాంటి ప్రత్యక్ష లేదా బాధ్యతాయుత నాయకత్వం లేకుండా అదృశ్య శక్తుల ద్వారానే ఆదేశాలు జారీ అయ్యాయి.. ఎన్నికల ప్రక్రియతో సంబంధం లేకుండా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఒక మార్గాన్ని సృష్టించేందుకే దీనిని ఉపయోగించుకున్నారు'' అని ఆమె ఆరోపించారు.ఇక, తన ప్రసంగంలో భారతదేశాన్ని 'బంగ్లాదేశ్కు గొప్ప మిత్రుడు' అని కూడా అభివర్ణించారు.
2024 ఆగస్టులో బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన వచ్చినప్పటి నుంచి షేక్ హసీనా భారత్లో నివసిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమం అణచివేతకు సంబంధించిన మానవత్వానికి వ్యతిరేక నేరాలు, జాతి నిర్మూలన ఆరోపణలపై బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది. ఇక, ఎన్నికల కమిషన్ సైతం అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించారు.

