JioBlackRock: భారతదేశ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ETF) మార్కెట్లోకి జియో అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ కలిసి జాయింట్ వెంచర్ జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్స్ (JioBlackRock Mutual Fund) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
అయితే, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ దిగ్గజ సంస్థ నుంచి తొలి ఈటీఎఫ్ ఫండ్ అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది. జియో బ్లాక్ రాక్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ (JioBlackRock Nifty 50 ETF) పేరుతో న్యూ ఫండ్ ఆఫర్ (NFO) తీసుకురావడంతో ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లోకి అడుగుపెట్టింది. మరి ఈ ఫండ్ గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
జియో బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్ మంగళవారం రోజున తొలి ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ జియో బ్లాక్ రాక్ నిఫ్టీ 50 ఈటీఎఫ్ను లాంచ్ చేసి పెట్టుబడులను సులభతరం చేస్తూ, మరింత మందికి చేరువ చేసే క్రమంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ న్యూ ఫండ్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఇప్పటికే మొదలవగా ఆగస్టు 11, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. భారతదేశంలోని వేగంగా వృద్ధి చెందుతున్న ETF మార్కెట్లోకి జియో బ్లాక్రాక్ ప్రవేసించి తన మార్క్ చూపించింది. విస్తృత శ్రేణి పెట్టుబడి పరిష్కారాలను అందించాలనే తమ నిబద్ధతను ఇది మరింత బలపరుస్తుందని ఆ జియో బ్లాక్ రాక్ ఫండ్ సంస్థ పేర్కొంది.
నిఫ్టీ 50 ఇండెక్స్ను ట్రాక్ చేస్తూ దీర్ఘకాలంలో మూలధన లాభాలు అందించడమే లక్ష్యంగా ఈ ఈటీఎఫ్ ఫండ్ రూపొందించినట్లు జియో బ్లాక్ రాక్ పేర్కొంది.ఒకే పెట్టుబడి ద్వారా ఇన్వెస్టర్లు దేశంలోని 50 అతిపెద్ద లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని ఈ స్కీమ్ కల్పిస్తుందని తెలిపింది. 2026, మార్చి 30 నాటికి ఈ ఇండెక్స్ దేశంలోని మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్లో 53.7 శాతం మేర ప్రాతినిధ్యం వహించడం గమనార్హం. భారతదేశ ఈక్విటీ మార్కెట్లో కీలకమైన బెంచ్మార్క్గా నిలిచింది. ఈ క్రమంలో ఈ కేటగిరీపై ప్రత్యేక దృష్టి సారించి మంచి లాభాలను అందించాలని ఈ కొత్త ఫండ్ తీసుకొచ్చినట్లు ఏఎంసీ తెలిపింది.
ఇది ఒక పాసివ్ ఫండ్ (Passive Fund). ఇందులోని డబ్బులను ఈక్విటీ, ఈక్వీటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనుంది. ఈ ఫండ్ పనితీరును నిఫ్టీ 50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్తో పోల్చి చూడనున్నారు. ఈ కొత్త ఫండ్ను తన్వి కచేరియా, ఆనంద్ సాహా, హరేశ్ మెహతాలు నిర్వహించనున్నారని ఏఎంసీ తెలిపింది. ఎన్ఎఫ్ఓ సమయంలో ఇందులో కనీస పెట్టుబడి లంప్ సమ్ విధానం అయితే రూ.500గా నిర్ణయించారు. ఆ తర్వాత ఎంతైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ 95-100 శాతం నిధులను ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయనుంది. 0-5 శాతం మాత్రమే డెట్, మనీ మార్కెట్లో పెడుతుంది.

