ఇటీవల 'పెద్ది' సినిమా సక్సెస్ ఈవెంట్ లో అవార్డులపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. రామ్ చరణ్ నటనకు నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అంటున్నారని చెప్పే క్రమంలో, అవార్డులు రావడానికి ఎన్నో దారులు ఉంటాయని చిరు చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
ఈ అంశంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. చిరంజీవి కామెంట్స్ పై తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ స్పందించారు.
నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు ఇటీవల 'పద్మశ్రీ' అవార్డ్ వచ్చిందనే సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయన్ను పద్మ పురస్కారంతో గౌరవించింది. ఇటీవలే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాజేంద్రప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ సందర్భంగా అవార్డులపై చిరంజీవి చేసిన కామెంట్స్ గురించి అడగ్గా.. ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
* 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్
''నిజం చెప్పాలంటే చిరంజీవి ఏ మూడ్ లో, ఏ రీజన్ తో అన్నారో నాకు తెలియదు. ప్రతీదాన్ని నెగెటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొన్న నేను తిరుమల నుంచి బయటకు వచ్చిన తర్వాత, 'పద్మశ్రీ అవార్డు నాకు స్వామి ఇప్పించారు. నాకు అంత సీన్ ఎక్కడుంది' అని సరదాగా అన్నాను. 'నాకు అంత సీన్ లేదు' అని నేను అన్నట్టు ఎవడో హెడ్ లైన్ పెట్టాడు. అది వాడి కర్మ. నేనేం చేయలేను. అలానే చిరంజీవి కూడా వేరే సందర్భంలో అన్నారని నేను అనుకుంటున్నాను. అతన్ని నేను సపోర్ట్ చేస్తున్నానని అనుకోవద్దు. ప్రతీది అదే మీనింగ్ తో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా. అవార్డుల విషయంలో నార్త్, సౌత్ అనే డిస్కషన్ అయితే ఉంది. చిరంజీవికి ఎన్నో బ్రహ్మాండమైన అవార్డులు వచ్చాయి కదా. ఈరోజు ఇండియాలో అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలో చిరంజీవి ఒకరు. కాబట్టి ఇలాంటివి విన్నా జస్ట్ అప్పుడే మర్చిపోండి'' అని రాజేంద్రప్రసాద్ అన్నారు.
అవార్డులు అడిగి తీసుకోవడం భిక్ష అవుతుందని, అదే వారు పిలిచి ఇస్తే గౌరవమని ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ అన్నారు. ''నాకు పద్మశ్రీ అవార్డు రావడం లేట్ అయిందనే మాట వాస్తవం. అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. ఆ విషయంలో నేను వెనుకబడ్డానేమో తెలియదు. కానీ నేను ఎప్పుడూ కూడా పద్మశ్రీ కోసం ప్రయత్నం చేయలేదు. అసలు ఆ అవార్డు గురించి ఆలోచన రాలేదు. ఆరాలు కూడా తీయలేదు. పీవీ నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మాత్రం 'ఆయన్ను అవార్డ్ అడగక పోయారా? ఆయన కాదంటారా!' అని ఒకరు సూచన చేశారు. నిజమే కావచ్చు కానీ, మనం అడిగి తీసుకోవడం భిక్ష. వారు ఇస్తే విలువ, గౌరవం. ఈ రోజుకు నాకు గౌరవంతో వచ్చింది'' అని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.
* 'విజయవాడ అంటే ఇంద్రసేన అడ్డా' అన్న నిర్మాత SKN.. 'జై ఎన్టీఆర్' అంటూ ఫ్యాన్స్ నినాదాలు!

