ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నర్నీపట్నం పండుగలో డప్పు కొడుతున్న ఓ వ్యక్తిపై అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్నట్లు ఆ వీడియోలో ఉంది.
ఈ నేపథ్యంలో పోలీసుల సమక్షంలోనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓ వ్యక్తిపై చేయి చేసుకోవటం.. అత్యంత హేయమైన చర్యగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో కొంతమంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో ఇది కూటమి పాలనకు నిదర్శనమంటూ.. వైసీపీ మద్దతుదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగిందనే దానిపై వైరల్ వీడియోలోని వ్యక్తి.. వివరణ ఇచ్చారు.
నర్సీపట్నం పండగ ఘటనను రాజకీయం చేయొద్దని వీడియోలోని వ్యక్తి కోరారు. తాను డప్పు కొడుతున్న సమయంలో అయ్యన్నపాత్రుడు తనపై చేయి చేసుకున్న ఘటనపై స్పందించి వీడియో విడుదల చేశారు. తాము చిన్నప్పటి నుంచి అయ్యన్నపాత్రుడి వద్ద ఓ కుటుంబంగా ఉంటున్నామని.. ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని కోరారు.
తన కారణంగా అయ్యన్నపాత్రుడు కాలికి దెబ్బ తగిలిందని.. అందుకే తనపై కోప్పడ్డారని చెప్పుకొచ్చారు. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం జాతరను చాలా గొప్పగా జరిపించారని.. ఈ విషయాన్ని అందరూ చెప్పుకుంటున్నారని అన్నారు. జాతర చూడటానికి ఎక్కడెక్కడి నుంచి జనం వచ్చారని.. దయచేసి ఈ ఘటనను రాజకీయం చేయవద్దంటూ భాస్కరరావు విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరోవైపు నర్సీపట్నం మరిడమ్మ జాతరను (మరిడి మహాలక్ష్మి జాతర) ప్రతి మూడేళ్లకు ఓసారి ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల మరిడమ్మ జాతర కనుల పండవలా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గరగల నృత్యం, కాగిత పువ్వుల అలంకరణ ఆకట్టుకుంది. కళాకారుల అలంకరణ, డప్పు వాయిద్యాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ జాతరను చూసేందుకు పొరుగున ఉన్న జిల్లాల నుంచి కూడా జనం భారీగా తరలివచ్చారు.
పులగం తల మీద పెట్టుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. పులగాలతో వచ్చిన మహిళలు.. నెత్తిన వీటిని పెట్టుకుని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఉంచి అమ్మవారికి కోరికలను విన్నవించుకున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వయంగా ఈ ఉత్సవం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ క్రమంలోనే ఈ ఘటన జరగ్గా.. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

