ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అధికార టీడీపీ నేత సైకిల్ దిగి, వైసీపీ కండువా కప్పుకున్నారు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన గూడపాటి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం రోజున తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో.. వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా గూడపాటి శ్రీనివాసరావును జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు వందలాది మంది అభిమానులతో గూడపాటి శ్రీనివాసరావు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నానరు. అనంతరం గూడపాటికి స్వయంగా కండువా కప్పిన జగన్, పార్టీలోకి ఆహ్వానించారు. గూడపాటితో పాటు ఆయన అనుచరులు పలువురు వైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్.. గూడపాటి శ్రీనివాసరావుతో పాటు వైసీపీలో చేరిన అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు తెలిపారు. గూడపాటి శ్రీనివాసరావును గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు. గూడపాటి శ్రీనివాసరావు రాబోయో రోజులలో అన్ని రకాలుగా మంచి చేస్తాడని కచ్చితంగా చెప్పగలనని ధీమా వ్యక్తం చేశారు. రేపల్లె నియోజకవర్గంలో మోహన్ను తమ్ముడిగా భావించి, వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని జగన్ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, రేపల్లె వైసీపీ ఇంఛార్జి పీటా నాగమోహనకృష్ణతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు
మరోవైపు కాపు సామాజికవర్గానికి చెందిన గూడపాటి శ్రీనివాసరావు.. రేపల్లె నియోజకవర్గం ఎమ్మె్ల్యే, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు గూడపాటి ప్రధాన అనుచరుడుగా పేరు తెచ్చుకున్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన గూడపాటి వైసీపీలో చేరటంతో రేపల్లెలో వైసీపీ పట్టుపెరుగుతుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీ జిల్లా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు గూడపాటి.
అయితే టీడీపీలో ఇన్నేళ్లుగా అసంతృప్తితో పనిచేశానని.. ఎన్నో అవమానాలు భరించానని గూడపాటి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే టీడీపీకి రాజీనామా చేసిన గూడపాటి.. వైఎస్ జగన్ను కూడా కలిశారు. మంగళవారం అభిమానులతో కలిసి వచ్చి వైసీపీ కండువా కప్పుకున్నారు. భవిష్యత్తులో వైసీపీలోకి మరిన్ని చేరికలు ఉంటాయని గూడపాటి శ్రీనివాసరావు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

