ఆంధ్రప్రదేశ్పై ఎల్నినో ప్రభావం కనిపిస్తోంది.. ఈ ఏడాది వర్షాలు పెద్దగా కురవడం లేదు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినా వాటి ప్రభావం పెద్దగా కనిపించలేదు.
ఇప్పటి వరకు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడ్డాయి.. లోటు వర్షపాతం నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణశాఖ ఏపీకి ఒక అలర్ట్ ఇచ్చింది. ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా తీరప్రాంతాల దగ్గర వాతావరణ పరిస్థితుల కారణంగా అల్పపీడనం ఏర్పడుతుందంటున్నారు. ఇటు తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ తెలిపింది.
మరోసారి వాతావరణశాఖ బంగాళాఖాతంలో అల్పపీడనంపై అలర్ట్ ఇవ్వడంతో.. రాష్ట్రంలో రైతులతో పాటుగా ప్రజలు వర్షాలపై ఆశలు పెట్టుకున్నారు. ఈ అల్పపీడనం కారణంగా సెప్టెంబరు 2 వరకు ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. వచ్చే రెండు రోజులు ఉరుములు, పిడుగులతో కూడిన వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎల్నినో కారణంగా వర్షాకాలంలో కూడా ఎండాకాలం వంటి పరిస్థితులు చూడాల్సి వస్తోందంటున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నా సరే ఈ ఏడాది పెద్దగ వర్షాలు లేవు. ఇటీవల రాష్ట్రానికి ఎగువ ప్రాంతంలో అల్పపీడనాలు ఏర్పడినా ఆశించి మేరు వర్షపాతం నమోదు కాలేదు.
దేశంలో అన్నిచోట్లా జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు లోటు వర్షపాతం ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో -27శాతం, దక్షిణాదిలో -22శాతం లోటు ఉంది. సగటు వర్షపాతం -13శాతం లోటుగా తేలింది. ఎల్నినో కారణంగా వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. కొంతమంది పంటలు సాగుచేయగా అవి ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరికొందరు రైతులు ఇప్పటి వరకు వ్యవసాయం మొదలు పెట్టలేదు.. కొందరు మాత్రం ప్రత్యామ్నాయం పంటల్ని సాగు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులకు సూచిస్తోంది.

