Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు.. నేరుగా ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో జమ

ఏపీకి కేంద్రం నుంచి భారీగా నిధులు.. నేరుగా ఉపాధి హామీ శ్రామికుల ఖాతాల్లో జమ

Telugu Samayam 2 weeks ago

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి మరోసారి భారీగా నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రంలో వీబీ జీరామ్‌జీ పథకం అమలుకు కేంద్రం ఈ నిధులు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం రూ.

1,414.16 కోట్లు విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ తర్వాత అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కే నిధులు ఇవ్వడం విశేషం. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి శ్రామికుల వేతనాల చెల్లింపునకు ఈఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబరుకు తొలి విడతగా ఈ నిధులు ఇచ్చారు. ఈ రూ. 1,414.16 కోట్లకు.. ఏపీ వాటా కింద మరో రూ. 565.66 కోట్లు (40% నిధులు) కలిపి శ్రామికులకు చెల్లిస్తారు.

ఈ నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఈ నెల 2న వీబీ జీరామ్‌జీ అమల్లోకి రాగా.. కేంద్రం మొదటి మూడు నెలలకు అవసరమైన శ్రామికుల వేతనాల కోసం కేంద్రం నిధులు విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన నిధుల్లో షెడ్యూల్‌ కులాలకు రూ. 241.54 కోట్లు, షెడ్యూల్డ్‌ తెగలకు రూ. 78.21 కోట్లు, ఇతర వర్గాలకు రూ. 1,094.41 కోట్లు ఇచ్చారు. రాష్ట్రం 40 శాతం వాటా కూడా కలిపి డీబీటీ విధానంలో శ్రామికుల ఖాతాల్లో నేరుగా వేతనాలు జమ చేస్తారు.

మరోవైపు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి అన్ని రాష్ట్రాల గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పథకం అమలు విధానాన్ని సమీక్ష చేశారు.. అనంతరం నిధులు విడుదల చేశారు. ఈ నెల 2న పథకం ప్రారంభించిన తొలిరోజే రికార్డ్ స్థాయిలో ఉపాధి కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్‌ను చౌహాన్ అభినందించారు. వీబీ జీరామ్‌జీ కొత్త చట్టం ద్వారా సగటున 10శాతం వేతనాలు పెంచామని.. ఇకపై ఏ రాష్ట్రంలో రోజువారి కూలి రూ. 300కంటే తక్కువగా ఉండదని తెలిపారు. వీబీ జీరామ్‌జీ పథకం అమలుకు మొదటి విడతగా రాష్ట్రాలకు రూ. 25,863 కోట్లను విడుదల చేసింది కేంద్రం.

భారత అభివృద్ధికి పునాది గ్రామాలే అన్నారు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సింధు నాగరికత నుంచి నేటి వరకు దేశ ప్రగతికి దిశ చూపింది గ్రామీణ భారతమేని.. ఇప్పుడు VB-GRAM-G ద్వారా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి కేంద్రంగా, ఆర్థిక శక్తికేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయన్నారు. గ్రామ సభల నుంచి ప్రతి శ్రామికుడు, ప్రతి రైతు, ప్రతి మహిళ వరకు అందరి భాగస్వామ్యంతో గ్రామీణాభివృద్ధికి కొత్త అధ్యాయం ప్రారంభమవుతోందన్నారు.

ఈ నెల 2న దేశవ్యాప్తంగా వీబీ జీరామ్‌జీ పథకాన్ని ప్రారంభించన సంగతి తెలిసిందే.. ఈ ప్రారంభ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించారు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam