Dailyhunt
ఏపీలో డ్వాక్రా మహిళలకు బంపరాఫర్.. ఒక్కొక్కరు రూ.4లక్షలు సంపాదించొచ్చు

ఏపీలో డ్వాక్రా మహిళలకు బంపరాఫర్.. ఒక్కొక్కరు రూ.4లక్షలు సంపాదించొచ్చు

Telugu Samayam 4 months ago

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.. వారు ఆర్థికంగా స్థిరపడేలా పథకాలను అమలు చేస్తోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు కొర్రమీను చేపల పెంపకం ద్వారా ఆదాయం పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

తక్కువ ఖర్చుతో ఏడాదికి రూ.3 నుంచి 4 లక్షల వరకు నికర ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్యాంకులు రుణాలు ఇచ్చి ప్రోత్సహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త ఆదాయ మార్గం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఎదగాలని అధికారులు ఆశిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేలా ఈ కొర్రమీను చేపల పెంపకం ప్రాజెక్టును రూపొందించారు.

బ్యాంకుల సహకారంతో రుణాలు అందించి, మహిళలకు శిక్షణ కూడా ఇవ్వనున్నారు. ఈ పెంపకం కోసం సర్కిలేటరీ విధానంలో మంచినీటిలో చేపలను పెంచుతారు. ఈ పద్ధతిలో చేపలను పెంచడం వల్ల నీటి వృధా తగ్గుతుంది. ఒక పెద్ద చెరువుతో పాటు, సింథటిక్ లేదా ఫైబర్ వంటి తేలికపాటి సామాగ్రితో చిన్న చెరువును నిర్మించుకోవచ్చు. దీనికి కేవలం పది సెంట్ల స్థలం సరిపోతుంది. ఈ విధంగా, తక్కువ స్థలంలోనే ఎక్కువ చేపలను పెంచి, మంచి ఆదాయం పొందవచ్చు.

నాలుగు నెలలు పాటూ చిన్నపాటి చెరువులో 10 నుంచి 20 గ్రాముల పిల్లలను ముందుగా పెంచుతారు. ఆ తర్వాత మరో నాలుగు నెలలు పెద్దచెరువులో వేసి పెంచుతారు. అప్పుడు ఒక్కో చేప కిలో వరకు బరువు పెరుగుతుంది. ముందుగా చెరువులో పిల్లలకు రూ.15వేలు ఖర్చవుతుంది. చేపల మేతకు రూ.1,12,000 ఉంటుంది.. ఇది మొత్తం కలిపి రూ.1,27,000 పెట్టుబడి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా మొత్తం దాదాపు 935 కిలోల చేపలు ఉత్పత్తి అవుతాయని అంచనా. మార్కెట్‌లో కొరమీను చేపలు కిలో రూ.280 చొప్పున విక్రయిస్తే రూ.2,49,536 వరకు ఆదాయం వస్తుంది. అయితే చేపల పెంపకానికి పెట్టుబడి పోగా రూ.1,22,536 వరకు నికర ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఏడాదిలో మూడుసార్లు చేపల్ని విక్రయించొచ్చు.. అంటే ఏడాదికి దాదాపు రూ.4లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు.

స్వయం సహాయక సంఘాల మహిళలకు కొర్రమీను చేపల పెంపకం ద్వారా ఆదాయం సంపాదించే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. మార్చి నెలాఖరు నాటికి యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉదయ్‌ ఆక్వా సంస్థ ఈ మహిళలకు సలహాలు, సూచనలు అందిస్తూ, తయారైన చేపలను కొనుగోలు చేస్తుంది. మహిళలు తమ ఉత్పత్తులను స్వయంగా కూడా అమ్ముకోవచ్చు. కొర్రమీను చేపల పెంపకం తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందిస్తుంది. ఈ చేపలు త్వరగా పెరుగుతాయి. వీటిని పెంచడానికి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam