ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాలవారీగా పెట్టుబడుల్ని ఆకర్షిస్తోంది. ఏదో ఒక ప్రాంతానికి కాకుండా జిల్లాలవారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తోంది.
నెల్లూరు జిల్లాలో టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్ఈఎల్) రూ.6,500 కోట్లతో ఇఫ్కో సెజ్లో ఇంగోట్, వేఫర్ల కోసం ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్లాంట్ ఏర్పాటు దిశగా మరో కీలక ముందడుగు పడింది.. ప్లాంట్ ఏర్పాటుకు టీపీఆర్ఈఎల్ బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో ప్లాంట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. ఇంగోట్, వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు.
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ నెల్లూరు ఇఫ్కో సెజ్లో 200 ఎకరాల్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనుండగా.. వెయ్యిమందికి ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. భారత్ ఇంగోట్, వేఫర్ల కోసం గతంలో చైనా ఆధారపడాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు టాటా వీటిని దేశీయంగానే ఉత్పత్తి చేయనుంది. ఇక చైనాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు అంటున్నారు. నెల్లూరు ప్లాంట్ను రెండు దశల్లో సుమారు పది గిగావాట్ల (జీడబ్ల్యూ) సామర్థ్యంతో నిర్మించనున్నారు.
టాటా కంపెనీ ఇంగోట్లు, వేఫర్ల తయారీ యూనిట్ అవసరాల కోసం 200 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ను (కెపాటివ్ పవర్) ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్ నీటి అవసరాల కోసం కనిగిరి రిజర్వాయర్ నుంచి పైప్లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. ఈ ప్లాంట్ రోజువారీ 12.6 మిలియన్ లీటర్ల నీటిని వినియోగించుకోనుంది. ఈ ప్లాంట్లో 2028 నాటికి పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. అలాగే ఈ ప్లాంట్ మొత్తం విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్ ఏరియా బఫర్ జోన్గా డెవలప్ చేస్తారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఎంతోమందికి ఉపాధి దక్కుతుందని భావిస్తున్నారు.
మరోవైపు అదానీ కృష్ణపట్నం పోర్టు నుంచి పెట్రోలియం దిగుమతులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పెట్రోలియం దిగుమతులకు గడువును పెంచుతూ కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 1తో ఆ గడువు ముగియగా.. ఇప్పుడు పీఈఎస్ఓ (పెట్రోలియం ఎక్స్ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్) నుంచి అనుమతులు ఉన్నంత వరకు దిగుమతులు చేసుకోవచ్చన్నారు.

