గవర్నమెంట్ హాస్పిటల్స్లో రోగుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. గుంటూరు జీజీహెచ్ లాంటి హాస్పిటల్స్ అయితే ఓపీ కోసం క్యూ లైన్లో నిల్చోవడానికి పడే కష్టాలు అన్నీ ఇన్నీ కాదు.
ఓపీనే కాదు బ్లడ్ టెస్టులు, ఇంకా మిగిలిన విభాగాల వద్ద కూడా క్యూ లైన్ కష్టాలే. ప్రభుత్వం ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు నెక్స్ట్జెన్ డిజిటల్ హాస్పిటల్ చొరవతో ఆధునికీకరణ వేగవంతం చేసింది.
డిజిటల్ హాస్పిటల్ ప్రాజెక్టులో భాగంగా గుంటూరు జీజీహెచ్లోని రోగులకు వేగవంతమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ, దాతల సహాయం, ఎన్టీఆర్ వైద్య సేవ నిధులతో 50 నూతన కంప్యూటర్లు, ట్యాబ్లెట్లను అందించారు. బార్ కోడ్ రీడర్లు, స్కానర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.
READ ALSO ట్రేడింగ్ యాప్ పేరుతో టోకరా.. ఏకంగా రూ. 52 లక్షలు కొట్టేశారు
గుంటూరు జీజీహెచ్కు ప్రతి రోజూ 5 వేల మందికి పైగా రోగులు వస్తుంటారు. దాంతో ఓపీ వద్ద ఎక్కువ రద్దీ ఉంటుంది. దాంతో ఓపీ కౌంటర్లను ఎక్కువ పెట్టినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. బ్లడ్ టెస్టు, రేడియాలజీ విభాగాల వద్ద కూడా ఇదే పరిస్థితి. ఓపీ వద్ద మాన్యువల్గానే రాయాల్సి వస్తోంది. ఇప్పటి వరకు ఉన్న క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేస్తున్నా సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు డిజిటల్ హాస్పిటల్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
ఈ డిజిటల్ హాస్పిటల్ సేవల్లో భాగంగా ఇప్పటికే ప్రింటర్లు, స్కానర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నాలుగు పరికరాలను కూడా ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నరు. వార్డులు, విభాగాల మధ్య సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి టాబ్లెట్ పీసీలు ఉపయోగపడుతున్నాయి. బ్లడ్ టెస్టులు, మందుల వివరాలు వేగంగా నమోదు చేసేందుకు బార్కోట్ ప్రింటర్లు, రోగుల డిజిటల్ డేటాను క్షణాల్లో ప్రాసెస్ చేసేందుకు బార్కోడ్ స్కానర్లను ఉపయోగిస్తున్నారు. ఈ డిజిటలైజేషన్ ద్వారా ఓపీ కౌంటర్ల వద్ద క్యూలైన్లలో గంటల తరబడి నిలబడే సమయం తగ్గిపోతుంది. మందుల పంపిణీ ప్రక్రియ కూడా సులభతరం అవుతుంది.

