Dailyhunt
హైదరాబాద్‌లో 8వ పే కమిషన్ సమావేశాలు.. తేదీలు ప్రకటన.. ఏయే రోజు అంటే?

హైదరాబాద్‌లో 8వ పే కమిషన్ సమావేశాలు.. తేదీలు ప్రకటన.. ఏయే రోజు అంటే?

Telugu Samayam 1 week ago

8th CPC: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛనల సవరణ కోసం ఏర్పాటు చేసిన 8వ సెంట్రల్ పే కమిషన్ ఉద్యోగా సంఘాల నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ప్రతిపాదనలు తీసుకుంటోంది.

ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో మూడు రోజుల పాటు వరుస సమావేశాలు చేపట్టింది. ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో పే కమిషన్ సభ్యులు పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్, శ్రీనగర్, లడాఖ్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆయా సిటీల్లో నిర్వహించే సమావేశాలకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ఇన్‌స్టిట్యూషన్స్, ఎంప్లాయీ యూనియన్లు, అసోసియేషన్లతో సమావేశమై పే కమిషన్ సంబంధిత అంశాలపై మాట్లాడనున్నారు. ఈ సమావేశాలు మే, జూన్ 2026 నెలల్లో జరగనున్నాయి. ఈ సమావేశాలకు హాజరు కావాలనుకునే ఉద్యోగా సంఘాలు మొదటగా తమ మెమోరండంలను 8వ వేతన కమిషన్ అధికారిక వెబ్‌సైట్లో అప్లోడ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌లో మీటింగ్ తేదీలు ఇవే

8వ వేతన కమిషన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఈనెలలోనే రానుంది. మే 18వ తేదీ సోమవారం, మే 19వ తేదీ మంగళవారం రోజు సమావేశాలు నిర్వహించనుంది. ఈ తేదీలకు అనుగుణంగా 8వ సీపీసీ వెబ్‌సైట్లో ఉద్యోగా సంఘాలు మెమోరండం సమర్పించాలని కోరింది. మే 8, 2026 తేదీలోపు అపాయింట్మెంట్ తీసుకోవాలని పే కమిషన్ తెలిపింది. అలాగే యూనిక్ మెమో ఐడీ జనరేట్ చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు మే 1, 2026 రోజున ఓ ప్రకటన జారీ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.

శ్రీనగర్ మీటింగ్ షెడ్యూల్

జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ సిటీలో పే కమిషన్ జూన్ 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించనుంది. శ్రీనగర్ పరిధిలోని సంఘాలు, ఇన్‌స్టిట్యూషన్లు, యూనియన్లు, అసోసియేషన్లు తమ మెమోరండం సమరిపంచి మే 16, 2026 రోజు లోపు అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరింది.

లడాఖ్ మీటింగ్ షెడ్యూల్

కేంద్ర పాలిత ప్రాంతం లడాఖ్‌లో జూన్ 8, 2026 రోజున 8వ పే కమిషన్ సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో పాల్గొనాలనుకునే వారు ముందుగా తమ మెమోరండం సబ్మిట్ చేసి మే 16,2026 తేదీ లోపు అపాయింట్మెంట్ తీసుకోవాలని పే కమిషన్ తెలిపింది. ఉద్యోగ సంఘాలు తమ మెమోరండం సమర్పించేందుకు ఇచ్చిన గడువు ఏప్రిల్ 30, 2026 నుంచి మే 31, 2026కు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ గడువు పెంపుతో ఉద్యోగా సంఘాలు తమ మెమోరండం సమర్పించేందుకు మరింత అవకాశం లభించినట్లయింది.
Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam