హైదరాబాద్లో (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) క్యూర్ స్కీమ్ కింద లక్ష ఫ్లాట్లను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ మహానగర పరిధిలో నివసిస్తున్న దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కలను నిజం చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగు వేసింది.
క్యూర్ పరిధిలో అందుబాటు ధరల్లో ఫ్లాట్ల నిర్మాణానికి గృహనిర్మాణ శాఖ కార్యదర్శి వీపీ గౌతమ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా లో ఇన్కమ్ గ్రూప్ (ఎల్ఐజీ), మిడిల్ ఇన్కమ్ గ్రూప్ (ఎంఐజీ) ఫ్లాట్లను నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఈ ప్రతిష్టాత్మక పథకం కింద అర్హులైన దిగువ, మధ్య తరగతి ప్రజల కోసం లక్ష ఫ్లాట్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ లక్ష ఫ్లాట్ల నిర్మాణాన్ని ఒకేసారి కాకుండా.. దశలవారీగా నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి విడత కింద.. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 12 వేల ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు హౌసింగ్ బోర్డుకు రేవంత్ రెడ్డి సర్కార్ అనుమతులు మంజూరు చేసింది.
ఈ లక్ష ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా అత్యంత నిరుపేదలు, దిగువ వర్గాల వారికి లబ్ధి చేకూర్చేలా ఎల్ఐజీ ఫ్లాట్ల లబ్ధిదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ భారీ ఉపశమనం కల్పించనుంది. వారికి ఫ్లాట్లతోపాటు భూమి యూడీఎస్ ఇవ్వడం, అదనంగా మరో రూ.5 లక్షల ఆర్థిక సబ్సిడీని కూడా ప్రభుత్వం అందించనుంది. దాని వల్ల సామాన్యుడికి కూడా ఫ్లాట్ కొనుగోలు చేయడంలో ఆర్థిక భారం తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

