దేశంలో ఇంధన ధరల రేట్లు పెరుగుతున్నాయి. నాలుగు రోజులకు ఒకసారి చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచుతున్న పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇంధన ధరల పెరుగుదల చోటుచేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో ఇంధన ధరల భారాన్ని తగ్గించుకునేందుకు ఇప్పటికే ప్రభుత్వాలు పొదుపు చర్యలు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజారవాణా వ్యవస్థ వినియోగం, నోవెహికల్ డే వంటి విధానాలను అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( జీహెచ్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
జీహెచ్ఎంసీ పాలకమండలి ఏర్పాటైన తర్వాత జీహెచ్ఎంసీ మేయర్ , డిప్యూటీ మేయర్తో పాటుగా అధికారుల కోసం ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మూడు కార్పొరేషన్ల ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. డ్రైవర్ కమ్ ఓనర్, అద్దె ప్రాతిపదికన జీహెచ్ఎంసీ కార్లు ఉపయోగిస్తోంది. వీటి స్థానంలో తొలి దశలో 45 ఎలక్ట్రిక్ కార్లు కొనాలని స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, మేయర్ , డిప్యూటీ మేయర్తో పాటుగా కమిషనర్, అడిషినల్ కమిషనర్, జోనల్, డిప్యూటీ కమిషనర్ల కోసం వీటిని వినియోగించనున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ కార్లు కొనాలనే జీహెచ్ఎంసీ ఆలోచన ఇప్పటిది కాదు. గతంలోనే ఈ ఆలోచన చేసినప్పటికీ.. పలు కారణాలతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
డిప్యుటేషన్పై ఎలక్ట్రికల్ ఇంజనీర్లు
మరోవైపు ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, స్ట్రీట్ లైట్ల నిర్వహణపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వీటి పర్యవేక్షణకు పది మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్లను డిప్యూటేషన్ మీద తీసుకోవాలని స్టాండింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే బడాబజార్ నుంచి మౌలాకా చిల్లా వరకూ 40 అడుగుల రహదారి విస్తరణకు ఆమోదం తెలిపారు. చిల్లా నుంచి భవానీ నగర్ వరకూ 60 ఫీట్ రోడ్డ విస్తరణకు కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. అంబర్ పేట్ అలీ కేఫ్ వద్ద అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ కేబుల్ మార్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జల్ పల్లి సర్కిల్ కార్యాలయ భవన నిర్మాణానికి కూడా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది.

