Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ.. రాతపరీక్ష, మెరిట్ ఆధారంగా ఎంపిక

ఇంటర్వ్యూలు లేకుండానే 984 వర్సిటీ ఉద్యోగాల భర్తీ.. రాతపరీక్ష, మెరిట్ ఆధారంగా ఎంపిక

Telugu Samayam 2 weeks ago

తెలంగాణలోని నిరుద్యోగులు, విద్యావంతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు రాష్ట్ర పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 984 అధ్యాపక, ఇతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

అయితే.. ఈ నియామకాల్లో భాగంగా కీలక మార్పుకు శ్రీకారం చుట్టారు. గతంలో ఉన్న ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ.. కేవలం రాతపరీక్షలు, అకడమిక్ మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

సాధారణంగా వ్యవసాయ, దాని అనుబంధ విశ్వవిద్యాలయాల్లో మొదటి నుంచి నియామకాల ప్రక్రియలో మెరిట్‌ పరిశీలన, రాతపరీక్షలతో పాటు ఇంటర్వ్యూలు నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇంటర్వ్యూల వల్ల కొన్ని సందర్భాల్లో పారదర్శకత లోపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇటీవల అగ్రివర్సిటీ తమ పరిధిలో 550 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పంపింది. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రతిపాదనలను సుదీర్ఘంగా పరిశీలించారు. నియామకాల్లో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటికే గ్రూపు-1 తదితర ప్రతిష్టాత్మక పరీక్షలన్నింటిలోనూ మౌఖిక పరీక్షలను మినహాయించామని సీఎం గుర్తుచేశారు. అదే పంథాలో వ్యవసాయ వర్సిటీల్లోనూ కేవలం రాతపరీక్ష ఆధారంగానే అత్యంత పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక జరగాలని అధికారులను ఆదేశించారు.

ఈ నిర్ణయం వల్ల మూడు ప్రధాన విశ్వవిద్యాలయాల్లో నియామకాల ప్రక్రియ వేగవంతం కానుంది. కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ ఇప్పటికే 79 అసిస్టెంట్ ప్రొఫెసర్, 44 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 17 ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయగా.. వాటిలోనూ ఇంటర్వ్యూలను మినహాయించాలని ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మౌఖిక పరీక్షలు లేకుండా కేవలం రాత పరీక్షల మార్కుల ఆధారంగా 550 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి త్వరలోనే సరికొత్త నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అగ్రివర్సిటీ వైస్ ఛాన్సలర్ జానయ్య ప్రకటించారు.

మరోవైపు పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం కూడా తమ పరిధిలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టులతో పాటు కొత్త ఖాళీలను కలిపి మొత్తం 294 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు కూడా ఇదే నయా రూల్ వర్తించనుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంపై అభ్యర్థుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సిఫార్సులు, అవకతవకలకు చెక్ పెడుతూ కేవలం ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు లభించే అవకాశం కలగడం వల్ల గ్రామీణ, పేద నేపథ్యం ఉన్న అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. సంబంధిత వర్సిటీల బోర్డులు త్వరలోనే పూర్తిస్థాయి సిలబస్, పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam