5G Premium Plans: దేశంలోని దిగ్గజ టెలింకాం సంస్థలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం ప్లాన్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ (TRAI) నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి.
రిలయన్స్ జియో ఇప్పటికే ఈ తరహా ప్రయత్నాలు మొదలు పెట్టింది. తాజాగా అదే దారిలో ఎయిర్టెల్ సైతం నడుస్తోంది. 5జీ ప్రీమియం సేవల కోసం నెట్ వర్క్ స్లైసింగ్ టెక్నాలజీని ఉపయోగించాలని ఆయా కంపెనీలు భావిస్తున్నాయి. ఇంతకీ ఈ స్లైసింగ్ టెక్నాలజీ ఏంటి, దేశంలో ఈ టెక్నాలజీకి ఎదురయ్యే సమస్యలు ఏంటి? తెలుసుకుందాం.
ప్రస్తుతం 4జీ రేట్ల తోనే 5జీ సేవలను అందిస్తున్నారు. ఈ కారణంగా ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. 5జీ స్పెక్ట్రమ్, మౌలిక సదుపాయాల కోసం చేసిన ఖర్చులను తిరిగి రాబట్టుకునేందుకు ప్రీమియం సర్వీసులు ఒక్కటే మార్గమని భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్ టెల్ తన ఆదాయాన్ని పెంచుకోవాలని, నెట్ వర్క్ స్లైసింగ్ టెక్నాలజీని ఇందుకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. అందుకు ప్రీమియం ప్లాన్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
ఏంటీ నెట్వర్క్ స్లైసింగ్?
ఒకే ఫిజికల్ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై మల్టిపుల్ వర్చువల్ నెట్వర్క్లను సృష్టించడమే ఈ టెక్నాలజీ ఉద్దేశం. ఒక్కో స్లైస్ ఒక్కో నిర్దిష్ట అవసరానికి అనుగుణంగా పని చేస్తుంది. హైస్పీడ్ గేమింగ్ కావాలనుకునే వారికి ఒక స్లైస్, వీడియో స్ట్రీమింగ్ కోసం మరో స్లైస్, ఎంట్రర్ ప్రైజ్ సేవల కోసం మరొకటి ఇలా ఉంటాయి. అంటే హైస్పీడ్ డేటా వేగంతో గేమింగ్ ఆడాలనుకున్నట్లయితే ఇకపై ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా 5జీ నెట్ వర్క్ను నిర్దిష్ట కస్టమర్ల అవసరాలను తీర్చేందుకు వినియోగించుకోవచ్చు. ఇప్పటికే రిలయన్స్ జియో 5జీ నెట్వర్క్ ఆధారిత ప్రీమియం సర్వీసులను తీసుకొచ్చేందుకు జియో, ఎయిర్టెల్లు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం చైనా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో ఇలాంటి స్పీడ్ ఆధారిత ప్రీమియం ప్లాన్లు ఉపయోగిస్తున్నారు. అయితే భారత్లో నెట్ న్యూట్రాలిటీ రూల్స్ ప్రతికూలంగా మారనున్నాయి. ఇలా వేరు వేరు వేగాలతో ప్లాన్స్ ఇవ్వడం నెట్ సమానత్వ నియమాలకు విరుద్ధంగా మారనుంది. ఈ విషయంపై టెలికాం నియంత్రణ సంస్థ నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఇది కేవలం నెట్వర్క్ పని తీరుకు సంబంధించింది కాబట్టి రూల్స్ ఉల్లంఘన కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే 5జీ కింద లభించే 400-500 ఎంబీపీఎస్ వేగం సాధారణ యాప్స్లకు అవసరం లేదనేది ఎయిర్టెల్ అభిప్రాయం. సాధారణ ప్రజలకు తక్కువ ధర, ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఎక్కువ ధర వసూలు చేసే అవకాశం ఉంటుంది.

