తనదైన నటనతో కోలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైన కార్తి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. త్వరలోనే 'సర్దా 2' ప్రేక్షకుల ముందుకు రానున్న కార్తి...
తాజాగా ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్లో ఒక కొత్త ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం కార్తీ కెరీర్లో 31వ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. పూర్తిస్థాయి కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్పై ప్రకటన వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో కార్తీకి జోడీగా నటించే హీరోయిన్ ఎవరనే అంశంపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ సాగుతోంది.
కోలీవుడ్ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఈ ప్రాజెక్ట్ లోకి తీసుకోవడానికి టీమ్ మొగ్గు చూపుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కథాంశాన్ని ఆమెకు వివరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టాక్. ఒకవేళ నయనతార ఈ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, గతంలో వచ్చిన 'కాశ్మోరా' చిత్రం తర్వాత కార్తీ - నయనతారల క్రేజీ కాంబినేషన్ మరోసారి వెండితెరపై పునరావృతం కానుంది. అంతేకాకుండా, దర్శకుడు మోహన్ రాజాతో నయనతారకు ఉన్న విజయవంతమైన ట్రాక్ రికార్డ్ ( 'తని ఒరువన్', 'వేలైక్కారన్', 'గాడ్ఫాదర్' ) ఈ ఆలోచనకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
అయితే షూటింగ్ కాల్షీట్ల సమన్వయం ఆధారంగా ఒకవేళ నయనతార డేట్స్ లభించని పక్షంలో, ప్రత్యామ్నాయంగా మరో స్టార్ హీరోయిన్ త్రిష పేరును బృందం పరిశీలనలో ఉంచింది. త్రిష ఓకే అయితే గనుక బ్లాక్బస్టర్ సిరీస్ 'పొన్నియిన్ సెల్వన్' తర్వాత కార్తీ, త్రిషల హిట్ పెయిర్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చినట్లవుతుంది. ఈ కాంబినేషన్కు కూడా సౌత్లో మంచి క్రేజ్ ఉన్నందున అభిమానులు ఈ అప్డేట్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. మోహన్ రాజా దర్శకత్వ ప్రతిభకు, కార్తీకి ఉన్న మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని అంచనా వేస్తున్నారు. హీరోయిన్ ఎంపికకు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ముద్ర పడనప్పటికీ, నయనతార లేదా త్రిషలలో ఎవరు ఫైనల్ అయినా ఈ ప్రాజెక్ట్కు మరింత గ్లామర్, క్రేజ్ రావడం ఖాయం. ఈ హీరోయిన్ రేసులో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

