14 ఏళ్లకే ఐపీఎల్లో మెరుపులు మెరిపించి, 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టుకు ఎంపికైన భారత యువ సంచలనం, బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీ.. టీమిండియా తరఫున సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
ఈ మేరకు ఐర్లాండ్, ఇంగ్లాండ్తో టీ20 సిరీస్ల కోసం ఎంపిక చేసిన జట్టులో అతడు చోటు సంపాదించాడు. ఈ నేపథ్యంలో అతడు తన పేరుతో భారత జెర్సీని అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
"మొత్తం దేశం ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ జట్టు జెర్సీ అందుకున్నాడు. ఆ అద్భుత క్షణాలను మీరూ చూసేయండి" అని బీసీసీఐ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసి క్యాప్షన్ ఇచ్చింది. టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు చేతుల మీదుగా వైభవ్.. తన జెర్సీ అందుకున్నాడు. జెర్సీ ఇచ్చేందుకు రఘు తన రూమ్ వద్దకు వచ్చినవెంటనే వైభవ్ ఏమాత్రం సంకోచించకుండా అతడి కాళ్లకు నమస్కరించాడు.
వైభవ్ సూర్యవంశీనికి 'నంబర్ 3'తో భారత జెర్సీ అందింది. అతడు ఈ జెర్సీ ధరించే టీమిండియా తరఫున బరిలోకి దిగనున్నాడు. జెర్సీ అందుకున్న తర్వాత మాట్లాడిన వైభవ్ సూర్యవంశీ.. భావోద్వేగానికి గురయ్యాడు. ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదని చెప్పుకొచ్చాడు. "క్రికెట్ బ్యాట్ పట్టుకుని ప్రాక్టీస్కు వెళ్లినప్పటి నుంచి.. ఇదే నా కల. భారత జెర్సీ వేసుకోవాలని కలలు కన్నా. ఈరోజు నా కల నెరవేరింది. నిజానికి నా క్రికెట్ ప్రయాణంలో కీలక దశ మొదలైంది. భారత జెర్సీ నా చేతికొచ్చింది. ఈ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఇదంతా ఓ కలలా ఉంది. జెర్సీని చేతిలో తీసుకోగానే సంతోషం పట్టలేకపోయా" అని వైభవ్ వ్యాఖ్యానించాడు.
కాగా గతంలో నంబరు 3 జెర్సీతో భారత జట్టు తరఫున గతంలో ఇద్దరు ప్లేయర్లు ఆడారు. స్పిన్నర్ హర్బజన్ సింగ్, ఆల్ రౌండర్ సురేశ్ రైనా.. ఈ నంబర్ జెర్సీతోనే జాతీయ జట్టు తరఫున ఆడారు. ఇప్పుడు వారు రిటైర్మెంట్ కావడంతో ఆ జెర్సీని వైభవ్కు కేటాయించారు.

