మాజీ మంత్రి కొడాలి నానికి గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. నాని విజయవాడలో మాట్లాడటం కాదని, దమ్ముంటే గుడివాడ రావాలని ఛాలెంజ్ చేశారు..
ప్రజలకు చేతనైన సాయం చేసి చూపించాలన్నారు. చంద్రబాబు, లోకేష్లపై నాని చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. కొడాలి నానిని గుడివాడ ప్రజలు ఏకంగా 53వేల ఓట్ల తేడాతో ఓడించినా బుద్ధి రాలేదన్నారు. గత ఎన్నికల సమయంలో కొడాలి నాని ఓ సవాల్ విసిరారని గుర్తు చేశారు.. చంద్రబాబు కుప్పంలో గెలిస్తే, తాను ఆయన బూట్లు తుడుస్తానని చెప్పిన మాటను వెనిగండ్ల రాము గుర్తు చేశారు. కొడాలి నాని సీఎం చంద్రబాబు బూట్లు తుడిచిన తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడాలన్నారు. చంద్రబాబు బూట్లు ఎప్పుడు తుడుస్తారో నాని చెప్పాలన్నారు. కొడాలి నాని ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్పొరేటర్గా కూడా గెలవలేరని.. తాను ఛాలెంజ్ చేస్తున్నానన్నారు.
గుడివాడలో కొడాలి నాని సీటు ఖాళీ అయ్యిందని వెనిగండ్ల రాము ఎద్దేవా చేశారు. ఆయన గురించి మాట్లాడటం కూడా దండగని.. గుడివాడ నియోజకవర్గ ప్రజలు చాలాకాలం క్రితమే మర్చిపోయారన్నారు. కొడాలి నానికి సిగ్గు లేదని.. సమాజం ఛీ కొడుతున్నా.. ఎన్నిసార్లు అవమానించినా సరే ఇంకా మీడియా ముందుకు ఎలా వస్తున్నారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడాలి నాని స్థాయి ఏంటి.. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయి ఏంటని ప్రశ్నించారు. జగన్కు పేపర్ మీద స్క్రిప్ట్ రాసిచ్చినా మాట్లాడలేరని.. ఆయనతో
రాజకీయ పరిజ్ఞానం కలిగిన చంద్రబాబు, మోదీని పోల్చడం ఏంటని ప్రశ్నించారు. జగన్ అమరావతిపై మాట మార్చారని.. సోషల్ మీడియాలో రీల్స్ కోసం కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడటం తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. కొడాలి నాని గుడివాడలో యాక్టివ్ కావడమే తమకు కావాలని.. అక్కడ ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామన్నారు. గుడివాడపై సరైన రాజకీయ పరిజ్ఞానం లేని నాని రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు.
టీడీపీ మహానాడుపై చంద్రబాబు, లోకేష్లపై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. చంద్రబాబు రెండేళ్ల పాలనలో చేసిన వెన్నుపోటు రాజకీయాలను ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. చంద్రబాబు, లోకేష్లకు ప్రధాని మోదీ దగ్గర ఒంగి, ఒంగి దండాలు పెట్టడమే తెలుసని ఎద్దేవా చేశారు. లోకేష్ తన దగ్గర ఉన్న ఒక్కశాఖను కూడా సమర్థవంతంగా నడపలేక పోతున్నారన్నారు. చంద్రబాబు జగన్తో చర్చకు రావాలని.. జగన్ ప్రజల కోసం ఎవరినైనా ప్రశ్నిస్తారన్నారు. జగన్ సింగిల్గా వచ్చే సింహమని.. గుంపులు గుంపులుగా వచ్చేది ఎవరో తెలుసంటూ కొడాలి నాని ఘాటుగా విమర్శించారు. నాని వ్యాఖ్యలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కౌంటరిచ్చారు.

