HCL Tech Q4 Results: దేశీయ ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన హెచ్సీఎల్ టెక్నాలజీస్ మంగళవారం మార్కెట్లు ముగిసిన తర్వాత గత ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించిన నాలుగో త్రైమాసికం (జనవరి-మార్చి) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
సమీక్షా త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 4.2 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. క్యూ4లో కంపెనీ నెట్ ప్రాఫిట్ గతేడాది ఇదే సమయంలో రూ.4,307 కోట్లుగా ఉండగా 4.2 శాతం వృద్ధితో రూ.4,488 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. ట్యాక్స్ తర్వాత వచ్చే లాభం అనేది కంపెనీ ఓనర్లకు చెందుతుందని చెబుతారు. ఈ క్రమంలో షేర్ హోల్డర్లకు శుభావార్త చెప్తూ ఫైనల్ డివిడెండ్ చెల్లించాలని కంపెనీ నిర్ణయించింది. మరి అందుకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లోని నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆపరేషన్స్ రెవెన్యూ రూ.33,981 కోట్లుగా నమోదైనట్లు హెచ్సీఎల్ టెక్ తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.30,246 కోట్లుగా ఉండగా దాంతో పోలిస్తే ఈసారి అది 12 శాతం మేర పెరిగినట్లు తెలిపింది. కంపెనీ ఆదాయం పెరిగడంతో పాటు ఖర్చులు తగ్గించుకోవడంతో సంస్థ లాభంలో వృద్ధి కనిపించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై టెక్ సంస్థ వివరాలు వెల్లడించలేదు.
డివిడెండ్ ప్రకటన
ఇక క్యూ4లో హెచ్సీఎల్ టెక్ ఎబిట (EBIT) రూ.5,620 కోట్లుగా (రెవెన్యూలో 16.5 శాతం)గా ఉంది. క్వార్టర్ టూ క్వార్టర్ చూసుకుంటే 10.6 శాతం తగ్గింది. అదే ఇయర్ ఆన్ ఇయర్ ప్రాతిపదికన చూస్తే 3.3 శాతం మేర పెరిగింది. కంపెనీ డివిడెండ్ ఒక్కే షేరుకు రూ.24 చొప్పున చెల్లించాలని నిర్ణయించగా అది వరుసగా 93వ క్వార్టర్లో డివిడెండ్ చెల్లిస్తుండడం గమనార్హం. దీంతో గత ఏడాదిలో మొత్తం డివిడెండ్ ఒక్కే షేరుకు రూ.60 మేర చెల్లించినట్లవుతుంది. డివిడెండ్ పేఔట్ రేషియే 97.6 శాతంగా ఉంది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో కొత్త ఆర్డర్లు 9,323 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఇక క్యూ4లో 1936 మిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందామని తెలిపింది.

