Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మార్కెట్ చరిత్రలోనే తొలిసారి.. మొక్కజొన్నకు రికార్డు ధర.. రైతు పంట పండింది

మార్కెట్ చరిత్రలోనే తొలిసారి.. మొక్కజొన్నకు రికార్డు ధర.. రైతు పంట పండింది

Telugu Samayam 3 hrs ago

సియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. మంగళవారం జరిగిన పంట కొనుగోళ్లలో మొక్కజొన్న పంటకు మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ధర లభించింది.

ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మరీ క్వింటా మొక్కజొన్నకు గరిష్ఠంగా రూ.2,310 ధర చెల్లించి కొనుగోలు చేశారు. ఓపెన్ మార్కెట్లో ఇంత భారీ మొత్తంలో ధర పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సాధారణంగా వచ్చే ధరల కంటే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం.

జిల్లాలోని పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన రైతు మామిండ్ల దేవేందర్‌కు ఈ రికార్డు ధర దక్కింది. ఆయన తనకున్న రెండెకరాల భూమిలో రూ.50 వేల పెట్టుబడితో మొక్కజొన్న సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో పాటు సరైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో రైతుకు ఎకరాకు ఆశించిన దానికంటే మంచి దిగుబడి వచ్చింది. మొత్తం రెండెకరాల నుంచి 72 క్వింటాళ్ల మొక్కజొన్న దిగుబడి సాధించారు. ఈ పంట సరుకును మంగళవారం ఎనుమాముల మార్కెట్‌కు తీసుకురాగా.. అక్కడి ప్రైవేటు వ్యాపారులు నాణ్యతను పరిశీలించి క్వింటాకు రూ.2,310 చొప్పున మొత్తం పంటను కొనుగోలు చేశారు. పెట్టుబడితో పోలిస్తే రైతు దేవేందర్‌కు ఊహించని రీతిలో భారీ లాభం చేకూరింది.

నిజానికి, ప్రభుత్వం ప్రకటించిన మొక్కజొన్న మద్దతు ధర క్వింటాకు రూ.2,400 గా ఉంది. అయితే ప్రభుత్వ సంస్థ అయిన మార్క్‌ఫెడ్‌ ఏర్పాటు చేసిన అధికారిక కొనుగోలు కేంద్రాల్లో సరుకు సేకరణ ప్రక్రియ తీవ్ర జాప్యంగా సాగుతోంది. టెక్నికల్ సమస్యలు, ఇతర కారణాల వల్ల కొనుగోళ్లు ఆలస్యం అవుతుండటంతో రైతు దేవేందర్ ఇంతకాలం తన పంటను ఇంట్లోనే నిల్వ చేసుకున్నారు. మార్కెట్లో డిమాండ్ పెరిగే వరకు వేచి చూశారు. ప్రభుత్వ కేంద్రాల ఆలస్యం కారణంగానే తాను పంటను ఇంట్లో దాచుకోవాల్సి వచ్చిందని,..కానీ ఇప్పుడు ఓపెన్ మార్కెట్లోనే మద్దతు ధరకు కేవలం 90 రూపాయల తక్కువతో మంచి ధర రావడం చాలా సంతోషంగా ఉందని సదరు రైతు వెల్లడించారు.

ప్రభుత్వ మద్దతు ధర రూ.2400 కు అత్యంత సమీపంగా ప్రైవేటు వ్యాపారులు రూ.2,310 లు వెచ్చించి మొక్కజొన్నను కొనుగోలు చేయడం ఇదే తొలిసారని ఎనుమాముల మార్కెట్‌ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. సాధారణంగా మార్కెట్ సీజన్ ప్రారంభంలో వ్యాపారులు తక్కువ ధరలకే కొనుగోలు చేస్తుంటారని కానీ ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, నాణ్యమైన దిగుబడి కారణంగానే ఈ రికార్డు ధర సాధ్యమైందని వివరించారు. రాబోయే రోజుల్లో మిగిలిన రైతులకు కూడా ఇదే తరహాలో మంచి ధరలు లభించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam