PMSBY: ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 3 రకాల జన్ సురక్షా పథకాలను అందిస్తోంది. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పేరుతో ఈ మూడు పథకాలను తీసుకొచ్చి 11 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ పథకాలతో ఏడాదికి రూ.20 కడితే చాలు రూ.2 లక్షల ప్రమాద బీమా లభిస్తోంది. అలాగే రూ.5000 వరకు పెన్షన్ పొందవచ్చు. మరో మైలురాయి దాటిన క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. మరి ఆ వివరాలు తెలుసుకుందాం.
PMSBY: అసంఘటతి రంగ కార్మికులతో పాటు ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత ఉండాలని కేంద్ర ప్రభుత్వం 3 రకాల బీమా, పెన్షన్ పథకాలను తీసుకొచ్చింది. అవే ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY). ఈ మూడ జన్ సురక్ష పథకాలను 2015, మే 9వ తేదీన ప్రారంభించారు. అంటే ఈ ఏడాది 2026, మే 9 నాటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా మరో మైలురాయిని దాటాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచి సుమారు రూ.25,160 కోట్ల క్లెయిమ్స్ పరిష్కరించామని తెలిపారు.ఆర్థిక మంత్రి ఏమన్నారంటే?

'11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ జన్ సురక్ష పథకాలు దేశ పౌరుల జీవితాల్లో అనిశ్చితులను తొలగించడంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందంచాయి. దీని ద్వారా ఇన్సూరెన్స్, పెన్షన్ రంగాన్ని విస్తృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. జన్ సురక్ష పథకాలు 11వ వార్షికోత్సవం సందర్భంగా గణాంకాలే ఇందుకు నిదర్శనం. పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై, ఏపీవై పథకాల కింద వరుసగా 27 కోట్లు, 58 కోట్లు, 9 కోట్లకు పైగా నమోదులు జరిగాయి' అని ఆర్థిక నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆయా పథకాల్లో కోట్లాది మంది చేరి లబ్ధి పొందుతున్నట్లు వివరించారు.
రూ.20తో రూ.2 లక్షల బెనిఫిట్

ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజనలో చేరి ఏడాదికి రూ.20 కడితే సరిపోతుంది. ఏకంగా రూ.2 లక్షల ప్రమాద బీమా రక్షణ లభిస్తుంది. బ్యాంకులో ఖాతా ఉన్నవారు పీఎంఎస్బీవై ఫారం నింపి ఇస్తే సరిపోతుంది. ప్రతి ఏటా అకౌంట్ నుంచి రూ.20 కట్ అవుతూ మీకు బీమా రక్షణ లభిస్తుంది.
రూ.436తో రూ.2 లక్షలు

ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో చేరిన పాలసీదారు ఏ కారణం చేతనైనా మరణిస్తే అతని కుటుంబానికి హామీ మొత్తం లభిస్తుంది. ఈ పాలసీ ఏడాది పాటు వ్యాలిడిటీ ఉంటుంది. ప్రీమియం చెల్లించి పునరుద్ధరించుకోవాలి. 18-50 ఏళ్లలోపు వారు బ్యాంక్ పొదుపు ఖాతా ద్వారా చేరవచ్చు. జూన్ 1 నుంచి మే 31 వరకు అమలులో ఉంటుంది. ఇందులో ఏడాదికి రూ.436 కట్టాల్సి ఉంటుంది. రూ.2 లక్షల బీమా రక్షణ లభిస్తుంది.
రూ.5000 వరకు పెన్షన్

అటల్ పెన్షన్ యోజన ద్వారా నెలకు రూ.5 వేల వరకు పెన్షన్ పొందవచ్చు. అసంఘటిత రంగ కార్మికులు ఇందులో చేరవచ్చు. 18 ఏళ్ల వయసు వారు అయితే నెలకు రూ.210 పెన్షన్ చెల్లించాలి. అదే 40 ఏళ్ల వారు అయితే నెలకు రూ.1454 కట్టాల్సి ఉంటుంది. రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పెన్షన్ ఎంత రావాలి అనేదాని బట్టి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

