ప్రజా సమస్యల పరిష్కారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేస్తున్నారు. జనవాణి కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా తన దృష్టికి వచ్చే అంశాలపై వేగంగా స్పందించే పవన్ కళ్యాణ్..
ఆ సమస్యల పరిష్కారంపైనా అంతే శ్రద్ధ తీసుకుంటున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ వాటిని వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మూడేళ్ల కిందట.. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తాను ఇచ్చిన మాటను పవన్ కళ్యాణ్ తాజాగా నిలబెట్టుకున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. జనవాణి, వారాహి యాత్రలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఏలూరు డిగ్రీ కళాశాలలో తరగతి గదులు లేక తాము పడుతున్న అవస్థలను ఆ కాలేజీ విద్యార్థులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో చెట్ల కింద పాఠాలు చెబుతున్న దీనస్థితిపై అప్పటి ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. చెట్ల కింద చదువులు చూడాలంటే ఎక్కడో మారుమూల పల్లెలకు వెళ్ళనవసరం లేదని.. ఏలూరు నగరంలోని ప్రభుత్వ కళాశాలకు వెళ్తే చాలంటూ విమర్శలు గుప్పించారు. పథకాలకు పేర్లు పెట్టుకోవడం మీద ఉన్న శ్రధ్ధ కాలేజీకి భవనం నిర్మించడంపై పెట్టాలని వైసీపీ సర్కారుకు చురకలు అంటించారు."300మంది చదువుతున్న ఈ కాలేజీకి బటన్ నొక్కి బిల్డింగ్ కట్టించు జగన్". అంటూ అప్పట్లో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది.

