మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన టీమిండియా..
బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఓడించింది. దీంతో గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. భారత్ తన తదుపరి మ్యాచ్లో జూన్ 21న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
ఇంగ్లాండ్లోని లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్.. భారత్కు బ్యాటింగ్ అప్పగించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధాన (47 బంతుల్లో 74 రన్స్), షెఫాలీ వర్మ (38 బంతుల్లో 55 రన్స్) అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్కు 70 బంతుల్లో 115 రన్స్ జోడించారు. దీంతో టీమిండియా భారీ స్కోరుపై కన్నేసింది. చివర్లో రిచా ఘోష్ (8 బంతుల్లో 20 రన్స్) మెరుపులు మెరిపించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో భారత్.. 5 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్.. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. శ్రీ చరణి 4 వికెట్లతో నెదర్లాండ్స్ పతనాన్ని శాసించింది. పార్ట్ టైమ్ బౌలర్ షెఫాలీ వర్మ 3 వికెట్లతో అదరగొట్టింది. నందిని శర్మ 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. దీంతో నెదర్లాండ్స్ కనీసం పూర్తి ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 17.3 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 2 పాయింట్లతో పాటు.. భారీగా నెట్రన్రేట్ సొంతం చేసుకుంది.
నెదర్లాండ్స్పై ఘన విజయంతో టీమిండియా పాయింట్స్ టేబుల్లో టాప్లోకి దూసుకెళ్లింది. ఆడిన రెండు మ్యాచ్లలోనూ గెలిచి.. 4 పాయింట్లు, +3.975 నెట్రన్రేట్తో అగ్రస్థానంలో చేరింది. ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోయింది. పాకిస్థాన్ ఐదో ప్లేసులో ఉంది. బంగ్లాదేశ్ మహిళల జట్టు ఒక్క విజయంతో మూడో ప్లేసులో కొనసాగుతోంది. లీగ్ స్టేజ్ ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ చేరతాయి.

