ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారంటే రెండు కారణాలుంటాయి ఒకటి నాణ్యమైన విద్య కోసం.. ఇంకొకటి లక్షలు లక్షలు ఖర్చు పెట్టలేక. ఈ రెండింటిలో ఎక్కువ మంది రెండో కారణంతోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటారు.
స్కూల్స్ మెర్జింగ్ జరిగిన తర్వాత దగ్గరలోని పాఠశాలల నుంచి కొంచెం దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తుంది. అయితే, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి రావడానికి బస్సు సౌకర్యం లేక పెద్ద సమస్యే వస్తోంది. ఇలాంటి సమయంలో ఆ పాఠశాల టీచర్లంతా కలిసి ఒక ఆటోను మాట్లాడి దానికి వాళ్లే డబ్బులు కట్టి మరీ పిల్లలను స్కూల్స్కి వచ్చేలా చేస్తున్నారు.
బాపట్ల జిల్లాలోని వెదుళ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో 216 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ చుట్టుపక్కల పాఠశాలలతో పోల్చిస్తే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న స్కూల్స్లో ఇదొకటి. ఆ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులను పాఠశాలకు రప్పించేందుకు ఉపాధ్యాయులు పెద్ద ఆలోచనే చేశారు.
READ ALSO కాటికెళ్లిన కన్నతల్లి.. కనిపించకుండా పోయిన తండ్రి.. ముగ్గురు చిన్నారుల దీనగాథ! ఎస్పీ రిస్కీ ఆపరేషన్తో కథ సుఖాంతం
దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఒక ఆటోను మాట్లాడారు. ఈ పిల్లలను పాఠశాల వద్ద దింపి మళ్లీ తీసుకెళ్లేలా మాట్లాడారు. అయితే, నెలకు రూ. 14 వేలు ఖర్చవుతుందని ఆ ఆటో డ్రైవర్ చెప్పాడు. దాంతో స్కూల్లో ఉన్న టీచర్లంతా కలిసి తమకు వచ్చే జీతం నుంచి తలా కొంచెం ఇచ్చి మరీ రూ. 14 వేలను ఆ ఆటో డ్రైవర్కు ఇస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ఈ టీచర్లు తీసుకున్న నిర్ణయానికి అందరూ సెల్యూట్ చేస్తున్నారు.
పాఠశాల ఉపాధ్యాయులు రెహమాన్, కుసుమాంబ, శివపార్వతి, సరిత, సుజాత, శ్యామ్సుందర్, సలాం అందరూ వేసవి సెలవుల్లో పాఠశాలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లి మరీ క్యాంపెయిన్ చేశారు. విద్యార్థుల కోసం ఆటో సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా సంతోషంగా పిల్లలను పాఠశాలకు పంపుతున్నారు. గతంలో పాఠశాలకు వచ్చేందుకు ఎలాంటి రవాణా సౌకర్యం లేకపోవడంతో చాలామంది చదువు కూడా మాన్పించిన సంఘటనలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఆటో సౌకర్యం ఏర్పాటు చేయడంతో కృపానగర్ నుంచి 50, స్టూవర్టుపురంలో 15, బేతపూడి గ్రామం నుంచి 40 మంది విద్యార్థులు వచ్చి చదువుకుంటున్నారు.

