Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు.. ఆసక్తికర చర్చ

ఒకే వేదికపైకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు.. ఆసక్తికర చర్చ

Telugu Samayam 3 hrs ago

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ నెల 25న కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం స్పిల్‌వే గేట్లను ప్రారంభించనున్నారు.

ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్‌.పాటిల్‌తో పాటుగా మూడు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఏసీ సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి కర్నూలు వెళ్లి అక్కడే బస చేస్తారు. గురువారం ఉదయం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కర్ణాటకలోని కొప్పళ జిల్లా ఐఆర్‌జీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రాజెక్టు దగ్గరకు వెళతారు. ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తోరణగల్లు దగ్గర జిందాల్‌ ఎయిర్‌పోర్ట్‌కు వెళతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తుంగభద్ర ప్రాజెక్టు దగ్గరకు చేరుకుంటారు.

ఈ నెల 25న ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్‌.పాటిల్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ ప్రాజెక్టు దగ్గరకు చేరుకుంటారు. అనంతరం ముగ్గురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ప్రాజెకట్ట్ 33 గేట్లను ప్రారంభిస్తారు. కేంద్రమంత్రి, ముగ్గరు సీఎంలతో పాటుగా మూడు రాష్ట్రాల నుంచి పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మునిరాబాద్‌ దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ కేంద్రమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొంటారు.

సోమవారం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలోని సచివాలయంలో కర్ణాటకకు చెందిన ప్రజాప్రతినిధులు కలిశారు. తుంగభద్ర ప్రాజెక్ట్ స్పిల్‌వే గేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. చంద్రబాబును కలిసిన వారిలో కర్ణాటక మాజీ మంత్రులు ఎన్‌.ఎస్‌.బోసురాజు, బసవరాజ రాయరెడ్డి, ఎమ్మెల్సీ బసవనగౌడలు ఉన్నారు. సీఎంకు ఆహ్వానపత్రిను అందజేసి కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అలాగే ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడికి కూడా ఆహ్వానం అందింది. మొత్తం మీద మూడు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కనిపించనున్నారు.

కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు తుంగభద్ర ప్రాజెక్ట్ ముఖ్యమైనది. ఏడాది క్రితం ప్రాజెక్ట్ 19వ గేటు కొట్టుకుపోయింది. తాత్కాలికంగా
నిపుణుల సహాయంతో స్టాప్‌లాగ్‌ గేట్‌ బిగించారు. అయితే నిపుణుల సూచన మేరకు 33 పాత క్రస్ట్‌ గేట్లను తొలగించి కొత్త వాటిని బిగించారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావడంతో ఈ నెల 25న ప్రారంభించనున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుతో ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప .. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల వాసులకు తాగునీరు, సాగునీరు అందిస్తోంది.. ఈ ప్రాజెక్టు నిర్మించి 73 ఏళ్లు కూడా పూర్తయ్యాయి. ఈ తుంగభద్ర ప్రాజెక్ట్ పరిధిలోకి కర్ణాటకలో 9,26,824 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్‌లో 7,20,054 ఎకరాలు, తెలంగాణలో 87,000 ఎకరాల స్థిరీకరించిన ఆయకట్టు ఉంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Telugu Samayam